
హైదరాబాద్: మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో శుక్రవారం హైడ్రామా నడిచింది. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఔట్ కాకపోయినా అంపైర్ పాశ్చిమ్ పఠాక్ ఔట్ ఇవ్వడంతో అతడు క్రీజు వదిలి వెళ్లేందుకు ఇష్టపడలేదు. అంతేకాదు అంఫైర్ను దుర్బాషలాడాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ సంఘటనను వరుస ట్వీట్లలో వివరించాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో ఏకీభవించని శుభమాన్ గిల్ క్రీజులోనే ఉండిపోయాడని పేర్కొన్నాడు. అసలు అంపైరింగ్ తెలుసా? అంటూ దుమ్మెత్తి పోసినట్లు వెల్లడించాడు.
రఫీ వెంటనే స్క్వేర్లెగ్ అంపైర్ పాశ్చిమ్ పఠాక్ను సంప్రదించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడని తెలుస్తోంది. అంపైర్ తొలుత ఔటిచ్చి తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో ఢిల్లీ ఆటగాళ్లు మైదానం వీడారు. ఈ క్రమంలోనే కాసేపు ఆట నిలిచిపోయింది. అయితే, రిఫరీ జోక్యంతో పది నిమిషాల్లో తిరిగి ఆట ప్రారంభమైంది.
ఇదిలా ఉండగా తమ ఆటగాళ్లు మైదానాన్ని వీడలేదని, అంపైర్ నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారని మాత్రమే అడిగారని ఢిల్లీ జట్టు మేనేజర్ వివేక్ ఖురానా తెలిపారు. కాగా, మ్యాచ్ ప్రారంభమయ్యాక గిల్ 23 పరుగుల వద్ద సిమర్జీత్ సింగ్ బౌలింగ్లో అనుజ్ రావత్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.
శుక్రవారం ప్రారంభమైన రంజీ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు సాన్విర్ సింగ్- శుభమాన్ గిల్లు ఇన్నింగ్స్ను ఆరంభించారు. సాన్విర్ సింగ్ డకౌట్గా పెవిలియన్ చేరడంతో గుర్క్రీత్ సింగ్ మన్తో కలిసి శుభమాన్ గిల్ ఇన్నింగ్స్ను నిర్మిస్తున్నాడు. ఢిల్లీ బౌలర్ సిమర్ జీత్ సింగ్ వేసిన 14 ఓవర్ తొలి బంతిని గిల్ ఎదుర్కొన్నాడు. అయితే, అది బ్యాట్కు తగలకుండానే వెళ్లి వికెట్ కీపర్ అనుజ్ రావత్ చేతిల్లో పడింది.
దీనిపై ఢిల్లీ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ పఠాక్ ఔట్గా ఇచ్చాడు. అయితే ఔట్ కాదనే విషయం గిల్కు స్పష్టంగా తెలియడంతో తాను క్రీజ్ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. ఔట్ కాదని టీవీ రిప్లేలో తేలడంతో గిల్కు మరింత కోపం తెప్పించింది. దీంతో అంఫైర్ను దుర్బాషలాడాడు. చివరకు మ్యాచ్ రిఫరీ కలగజేసుకుని గిల్కు సర్ధి చెప్పాడు.