సూపర్ ఓవర్లో బుమ్రానే ఎందుకు.. అసలు కారణం చెప్పిన రోహిత్!!

హామిల్టన్: న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా సూపర్ ఓవర్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓపెనర్ రోహిత్ శర్మ చివరి రెండు బంతులను సిక్సులుగా మలిచి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. మూడో మ్యాచ్లో రెండు జట్ల స్కోర్లు టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించారు. ఈ మ్యాచులో జస్ప్రీత్ బుమ్రా అత్యధిక పరుగులు సమర్పించుకున్నాడు. న్యూజిలాండ్ అతని ఓవర్లలో మొత్తం 45 పరుగులు చేసింది.

సూపర్ ఓవర్లో 17 పరుగులు:
బుమ్రా అత్యధిక పరుగులు (45) ఇవ్వగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ అతడితోనే సూపర్ ఓవర్ వేయించాడు. ఆ ఓవర్లోనూ బుమ్రా 17 పరుగులు సమర్పించుకున్నాడు. కేన్ విలియమ్సన్ ఓ సిక్సర్, బౌండరీ బాదితే.. ఆఖరి బంతికి మార్టిన్ గప్తిల్ బౌండరీ సాధించడంతో కివీస్ 17 పరుగులు చేసింది. దీంతో టీమిండియా లక్ష్యం 18 పరుగులుగా మారింది. ఛేదనలో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడి చివరి రెండు బంతులకు సిక్సులు బాదడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. మ్యాచ్ ఓడిపోతే మాత్రం బుమ్రా ఖాతాలోనే అపవాదు చేరేది.

బుమ్రానే ఎందుకు:
సూపర్ ఓవర్ బుమ్రాకే ఇవ్వడంపై రోహిత్ మీడియాతో మాట్లాడుతూ అసలు కారణం చెప్పాడు. 'సూపర్ ఓవర్కు మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాలలో ఒకరిని పంపించాలనే విషయంపై సందిగ్ధత నెలకొంది. కానీ.. బుమ్రా జట్టులో కీలకమైన పేసర్. ఇప్పటికే మూడుసార్లు సూపర్ ఓవర్ వేసిన అనుభవం ఉంది. ఇక యార్కర్లు, స్లో బంతులు వేసే బుమ్రా అయితేనే బాగుంటుందనుకున్నాం. అందుకే బుమ్రాను పంపాం' అని రోహిత్ స్పష్టం చేసాడు.

65 పరుగులు చేయకుంటే:
'మ్యాచ్ టైగా మారి సూపర్ ఓవర్కు దారితీస్తే.. ఆ సమయంలో ఎలాంటి ప్రణాళికలు వేసుకునే అవకాశం ఉండదు. ఆ రోజు ఆటలో ఏం జరిగిందో దాన్నే దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది, అందులో ఎవరు బాగా ఆడితే వారినే పంపిస్తారు. బ్యాటింగ్ విషయంలోనూ ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారే బరిలోకి దిగుతారు. ఒకవేళ నేను ఈ మ్యాచ్లో 65 పరుగులు చేయకుంటే.. సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేసేవాడిని కాదు. నా స్థానంలో వేరే ఆటగాడు వెళ్ళేవాడు' అని పేర్కొన్నాడు.

రిజర్వ్బెంచ్ ఆటగాళ్లకు అవకాశం:
ఇప్పటికే 3-0తో సిరీస్ భారత్ కైవసం కావడంతో మిగిలిన రెండు మ్యాచ్ల్లో రిజర్వ్బెంచ్ ఆటగాళ్లకు అవకాశం కల్పించనున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. సిరీస్లో నాలుగో మ్యచ్ శుక్రవారం వెల్లింగ్టన్లో, ఫైనల్ మ్యాచ్ ఆదివారం మౌంట్ మాంగనిలో జరగనుంది. నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ ఈ పర్యటనలో ఇంకా అవకాశం దక్కని బౌలర్లు. వీరిలో కనీసం ఇద్దరికైనా నాలుగో మ్యాచ్ తుది జట్టులో స్థానం లభించవచ్చని సమాచారం. గత ఏడాది కాలంగా విపరీతంగా క్రికెట్ ఆడుతున్న మొహమ్మద్ షమీకి విశ్రాంతినివ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అతని స్థానంలో సైనీని ఎంచుకోవచ్చు. యుజువేంద్ర చహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాకు బదులుగా సుందర్లను ఎంచుకోవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications