ధోనీని విస్మరించే ప్రశ్న లేదు
"ధోనీని విస్మరించే ప్రశ్న లేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్నకు ప్రణాళికలు సిద్ధం చేసుకొనేందుకు, పటిష్టమైన జట్టును రూపొందించేందుకు నిజానికి ధోనియే మాకు సమయమిచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రిషభ్ పంత్ గాయపడితే అతడి స్థానం భర్తీచేసే మరొక ఆటగాడు లేడని ధోనీ సైతం భావిస్తున్నాడు" అని ఆ సెలక్టర్ చెప్పుకొచ్చాడు.
ధోనీ పాత్ర గురించి చర్చించారా?
2019 ప్రపంచకప్ తర్వాత ధోనీ పాత్ర గురించి చర్చించారా? అన్న ప్రశ్నకు గాను "లేదు. భవిష్యత్తు ప్రణాళిక గురించి ధోనితో చర్చించాల్సి ఉంది. అందుకే మేం ప్రణాళికలు సిద్ధం చేసుకొనేందుకు, రిజర్వు ఆటగాళ్లను పటిష్ఠం చేసుకొనేందుకు అతడే మాకు సమయం ఇచ్చాడు. ఏదో సందర్భంలో పంత్ గాయపడితే, టీ20 ప్రపంచకప్ మిస్సయితే అప్పుడు ధోనీ లేకుంటే పరిస్థితి ఏంటన్నది చూడాలి" అని ఆయన అన్నారు.
వికెట్ కీపర్గానే కాదు
"వికెట్ కీపర్గానే కాదు ధోని లాంటి ఫినిషర్ మాకింకా దొరకలేదు. విమర్శలు వచ్చినప్పటికీ వరల్డ్కప్ సెమీస్లో ధోని అనుభవం ఎంతోగానో ఉపయోగపడింది. 350 వన్డేలు, 98 టీ20లు ఆడిన ఓ గొప్ప ఆటగాడిని విమర్శించడం తేలికే. వారి జీవితంలో చాలా మంది చూసిన దానికంటే ఎక్కువ మ్యాచ్ల్లో ధోని జట్టులో గెలిపించాడు" అని ఆ సెలక్టర్ అన్నారు.
మైదానంలో గట్టి పోటీ
"ఈ సాంకేతిక యుగంలో, ప్రత్యర్ధి జట్టు బౌలర్లు ధోని బలాన్ని, బలహీనతను చూడటం లేదని మీరు అనుకుంటున్నారా? వారు కూడా మైదానంలో గట్టి పోటీ ఇస్తున్నారు. వారంతా ధోనికి బౌలింగ్ చేయరు. క్రీజులో ఉన్న బ్యాట్స్మెన్ను ఔట్ చేయాలని భావిస్తారు. నిజాయితీగా చెప్పాలంటే రిషబ్ పంత్ గాయపడితే.. పరిమిత్ ఓవర్ల ఫార్మాట్లో అతడి స్థానాన్ని భర్తీ చేసే అటగాడు ఇంకా దొరకలేదు" అని తెలిపారు.