హైదరాబాద్: ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్కప్ జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్థానానికి ఎటువంటి ఢోకాలేదని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ వెల్లడించాడు. ఈ ఏడాది మే 30న ప్రారంభమయ్యే ఈ వరల్డ్ కప్ జూలై 14న ముగియనుంది. ఈ సారి వరల్డ్కప్ను రౌండ్రాబిన్ పద్థతిలో నిర్వహిస్తున్నారు.
ఐపీఎల్ 2019 షెడ్యూల్ విడుదల: ఫస్ట్ మ్యాచ్ ధోనీ Vs కోహ్లీ
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మహమ్మద్ కైప్ ఓ మీడియాతో వరల్డ్కప్లో భారత విజయావకాశాలపై స్పందించాడు. కైఫ్ మాట్లాడుతూ "ప్రస్తుత భారత జట్టులో ప్రతి ఒక్కరూ ధోని సలహాలే తీసుకుంటున్నారు. ధోని ప్రస్తుతం కెప్టెన్ కాకపోయినప్పటికీ విరాట్ కోహ్లీ సైతం అతడి సూచనలనే పాటిస్తాడు. ధోనీపై అతడికంత నమ్మకం" అని అన్నాడు.
"టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్ కోహ్లీ.. ధోనీ దగ్గరకు వెళ్లి సలహాలు తీసుకుంటారు. అలాగే బౌలర్లు కూడా ధోనీ చెప్పినట్టే వింటారు. ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లో ధోనీ తిరిగి ఫామ్లోకి రావడంతో టీమిండియాకు పెద్ద సానుకూలాంశం. ప్రపంచకప్కి ముందు ధోనీతోపాటు కోహ్లీ ఇతర ప్రధాన ఆటగాళ్లు మంచి ఫామ్లో ఉండడం భారత జట్టుకు కలిసొస్తుంది" అని కైఫ్ పేర్కొన్నాడు.
ఇక, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రశ్నించగా... "కోహ్లీ అద్భుతమైన కెప్టెన్. ఇలాంటి నాయకుడే భారత జట్టుకి అవసరమని నేను భావిస్తున్నా. యువక్రికెటర్లకు అతడెంతో స్ఫూర్తి. అతడు జట్టులోకి వచ్చినప్పటి నుంచీ అద్భుతంగా ఆడుతున్నాడు. సహచర ఆటగాళ్లకు ఎంతో ఆదర్శం. కోహ్లీ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు" అని కైఫ్ చెప్పుకొచ్చాడు.