ఇద్దరం కలిసి సిరీస్లలో రాణించాం:
‘ఇద్దరం కలిసి శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ల్లో రాణించాం. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాం. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లడం నాకు ఇదే తొలిసారి. 2019 ప్రపంచకప్ కూడా ఇక్కడే జరగనుంది. దీంతో ఈ పర్యటన ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. గతంతో పోలిస్తే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే బెస్ట్ ఇండియన్ టీమ్ ఇదే అని చెప్పొచ్చు' అని చాహల్ అన్నాడు.
యువ ఆటగాళ్లకు ఇదో మంచి అవకాశం
‘యువ ఆటగాళ్లకు ప్రతి ఒక్క సిరీస్ ఎంతో ముఖ్యమైనది. ఇంగ్లాండ్ ఎంతో బలమైన జట్టు. వన్డే, టీ20ల్లో చాలా మంచి క్రికెట్ ఆడుతోంది. నాలాంటి యువ ఆటగాళ్లకు ఇదో మంచి అవకాశం. సొంతగడ్డపై ఇంగ్లిష్ జట్టును ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్నది.' అని కుల్దీప్ అన్నాడు.
టీ20ల్లో విశేషంగా రాణించగలుగుతున్నామంటే..:
వన్డే, టీ20ల్లో విశేషంగా రాణించగలుగుతున్నామంటే దానికి ముఖ్య కారణం మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ అని అంటున్నారు ఈ స్పిన్ ద్వయం. ‘వికెట్ల వెనుక ఉండే ధోనీ 50 శాతం మా పనిని చేస్తాడు. మేము బౌలింగ్కు రాగానే ఎంతో విలువైన సలహాలు ఇస్తాడు. ఏ ప్రదేశంలో బంతి వేయాలో చెప్తాడు. అంతేకాదు బ్యాట్స్మెన్ ఎక్కడ బంతివేస్తే కొట్టేందుకు ఇబ్బంది పడతాడో కూడా చెప్తాడు.
స్పిన్నర్లకు ఎంతో మద్దతిస్తారు:
దీంతో మాకు బౌలింగ్ వేయడం ఎంతో సులువు అవుతోంది. వీరిద్దరూ స్పిన్నర్లకు ఎంతో మద్దతిస్తారు. ఒక్కోసారి ఒకే ఓవర్లో 10 నుంచి 15 పరుగులు ఇచ్చినా మాపై ఎటువంటి ఒత్తిడి తీసుకురారు. వికెట్లు తీయడమే వారికి ముఖ్యం.' అని చాహల్, కుల్దీప్ తెలిపారు.