పాండ్యా, రాహుల్పై కోహ్లీ
"టీమిండియాకు మేము ఆడుతున్నాం. కాబట్టి, హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. ఇటీవల ‘టాక్ షో'లో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వ్యక్తపరిచిన అభిప్రాయాలతో మేము ఏకీభవించడం లేదు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం. ప్రస్తుతం బీసీసీఐ తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. తాజా పరిణామాలు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంపై ఎటువంటి ప్రభావం చూపబోవు. ఎన్ని వివాదాలు జరిగినా మా క్రీడా స్ఫూర్తి చెదిరిపోదు. పాండ్యా, రాహుల్ చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం" అని విరాట్ కోహ్లీ అన్నాడు.
శనివారం తొలి వన్డే
మూడు వన్డేల సిరిస్లో భాగంగా శనివారం ఉదయం 7.50 గంటలకు సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే ప్రారంభంకానుంది. ఆసీస్ గడ్డపై ఇటీవల ముగిసిన నాలుగు వన్డేల సిరిస్ను 2-1తో గెలిచి కోహ్లీసేన చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అంతకముందు జరిగిన మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది.
అసలేం జరిగింది?
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్' షోకి ఇటీవల హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వెళ్లారు. ఈ టాక్ షోలో కేఎల్ రాహుల్ ఆచితూచి బదులిచ్చినప్పటికీ పాండ్య మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. ముఖ్యంగా కరణ్ జోహార్ హార్ధిక్ పాండ్యా లవ్స్టోరీ గురించి అడగ్గా తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు.
తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి
మరోవైపు కేఎల్ రాహుల్ కూడా తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి వివరిస్తూ వివాదాస్పదంగా చెప్పుకొచ్చాడు. తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు' అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు. ఈ షో ఇటీవల ప్రసారంకాగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో పాండ్యా ట్విట్టర్లో క్షమాపణ కూడా చెప్పాడు. భారత క్రికెట్ జట్టుకు ఆడుతూ హుందాగా వ్యవహరించాల్సిన ఇద్దరు క్రికెటర్లు ఇలా మాట్లాడటంపై సోషల్ మీడియాలో అభిమానులు మండిపడుతున్నారు. దీంతో తన వ్యాఖ్యలపై హార్దిక్ పాండ్యా ఇప్పటికే ట్విటర్ ద్వారా క్షమాపణ కోరగా.. కేఎల్ రాహుల్ ఇంకా స్పందించలేదు.
మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు
టీవీ షోలో మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్పై రెండు వన్డేల నిషేధం విధించాలని తాను ప్రతిపాదించినట్లు బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ ఇప్పటికే స్పష్టం చేయగా.. కమిటీలోని మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం వేటు వేసే ముందు న్యాయపరమైన సలహా తీసుకుందామని అన్న సంగతి తెలిసిందే. దీనిపై సీఓఏ ఇంకా ఏకాభిప్రాయానికి రాకపోయినా.. వీరిపై ఏదో రూపంలో చర్యలు మాత్రం తప్పవని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఒకవేళ బీసీసీఐ నిషేధిం విధిస్తే.. పాండ్యా, రాహుల్ శనివారం నుంచి ఆసీస్తో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు వన్డేలకు దూరమవుతారు.