డబుల్ సెంచరీనే లాస్ట్..
ఇదే విషయాన్ని మాజీ లెజెండ్ గౌతం గంభీర్ ఎత్తిచూపాడు. డబుల్ సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ గ్రాఫ్ పైపైకి పోతుందని అంతా అనుకున్నారని, కానీ అది జరగడం లేదని గంభీర్ అన్నాడు. డబుల్ సెంచరీ తర్వాత వన్డేల్లో అతని అత్యధిక స్కోరు కేవలం 17 మాత్రమే. ఇక టీ20ల్లో కూడా ఇషాన్ అంతం గొప్ప ఫామ్లో లేడు. గడిచిన 12 ఇన్నింగ్సుల్లో అతని టాప్ స్కోరు 36 అంటేనే అతను ఎంత గొప్ప ఫామ్లో ఉన్నాడో అర్థమౌతుంది. దీనిపై తాజాగా గంభీర్ స్పందించాడు.
కిషన్కు అది చేతకావట్లేదు..
'ఈ కుర్రాళ్లు స్ట్రైక్ రొటేట్ చేయడం ఎలాగో త్వరగా నేర్చుకోవాలి. కివీస్తో తొలి రెండు టీ20లు జరిగినటువంటి పిచ్లపై ముందుకు దూకి భారీ సిక్సర్లు కొట్టడం కుదరదు' అని కిషన్ ఆటతీరును విశ్లేషించాడు. కిషన్ ఎక్కువగా భారీ షాట్లపైనే ఆధారపడుతుంటాడు. ఈ క్రమంలో స్ట్రైక్ రొటేట్ చేయకుండా ఎక్కువ డాట్ బాల్స్ ఆడటం కూడా అందరి దృష్టికీ వచ్చింది. తాజాగా ముగిసిన భారత్, న్యూజిల్యాండ్ రెండో టీ20లో కూడా ఈ విషయం స్పష్టమైంది. ఈ మ్యాచులో అతను క్రీజులో చాలా సేపు ఉన్నాడు. కానీ సరిగా స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాడు. చివరకు 32 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
కావలసింది భారీ షాట్లు కాదు..
'బంగ్లాదేశ్లో అతని ఆడిన ఇన్నింగ్స్, అక్కడ డబుల్ సెంచరీ చేసిన విధానం తర్వాత అతని ఆటతీరు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. అలాంటి ఇన్నింగ్స్ తర్వాత మరీ ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నాడు. ఆ మ్యాచ్ తర్వాత కిషన్ గ్రాఫ్ పైకి ఎదుగుతుందని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు' అని గంభీర్ అన్నాడు. అలాగే భారత ఆటగాళ్లు స్పిన్ ఆడటం బాగా ప్రాక్టీస్ చేయాలని, అది వారికి పెద్ద సమస్యగా మారిందని తెలిపాడు. 'ఒక్క కిషన్ మాత్రమే కాదు.. భారత బ్యాటింగ్ లైనప్ అందరూ స్పిన్ ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. భారీ షాట్లు కొట్టడం కాదు. స్ట్రైక్ రొటేట్ చేయడం కావాలి' అని స్పష్టం చేశాడు.