
హైదరాబాద్: భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20కి సర్వం సిద్ధమైంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో శ్రీలంక రెండు మార్పులు చేసింది. ఏంజెలో మాథ్యూస్, సందకాన్లు తుది జట్టులోకి తీసుకుంది.
మరోవైపు టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో రిజర్వ్ బెంచ్ను పరీక్షించాలని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. ఇందులో భాగంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్కు చోటు దక్కగా... తుది జట్టులో చోటు కోసం కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న మనీశ్ పాండేతో పాటు కుల్దీప్ స్థానంలో చాహల్కు చోటు దక్కింది.
మూడో టీ20లో గనుక టీమిండియా విజయం సాధిస్తే శ్రీలంకపై తన రికార్డుని కూడా మరింతగా మెరుగుపరచుకుంటుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తర్వాత శ్రీలంకపై ద్వైపాక్షికి సిరిస్లో ఇప్పటివరకు టీమిండియా ఓడిపోలేదు. ఇరు జట్ల మధ్య 6 టీ20ల సిరిస్లు జరగ్గా అందులో టీమిండియా 5 సిరిస్ విజయాలను సొంతం చేసుకుంది.
ఒక సిరిస్ డ్రాగా ముగిసింది. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అద్భుతమైన ఫామ్లో ఉంది. ఇప్పటికే కోహ్లీ సేన రెండు టీ20 సిరిస్ విజయాలను సొంతం చేసుకోగా... శ్రీలంక మాత్రం వరుసగా 4 సిరిస్ల్లో ఓడిపోయింది. ఈ ఏడాది అక్టోబర్లో టీ20 ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి సిరిస్ను టీమిండియా సీరియస్గా తీసుకుంది.
ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించడంతో మూడు టీ20ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. దీంతో చివరిదైన మూడో టీ20లో సైతం విజయం సాధించి 2-0తో కైవసం చేసుకోవాలని భారత్ తహతహలాడుతోంది. తద్వారా 2020కి ఘనమైన ఆరంభం ఇవ్వాలని చూస్తోంది.
మరోవైపు ఇండోర్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగుతుంటే.. ఆఖరి మ్యాచ్లోనైనా విజయం సాధించి సిరిస్ను సమం చేయాలని శ్రీలంక భావిస్తోంది.
జట్ల వివరాలు:
శ్రీలంక: దనుష్క గుణతిలక, అవిష్కా ఫెర్నాండో, కుసల్ పెరెరా (వికెట్ కీపర్), ఓషాడా ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, దాసున్ షానకా, లక్షన్ సందకన్, వనిండు హసరంగా, లసిత్ మలింగ (కెప్టెన్)
ఇండియా: లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), మనీష్ పాండే, సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైని, జస్ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చాహల్