చేతులెత్తేసిన పాక్ బ్యాట్స్మెన్
దాయాది జట్టుపై భారత బౌలర్లు తొలి నుంచీ ఆధిపత్యం చెలాయించి తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దీంతో పాక్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. ఈ క్రమంలో టార్గెట్ను 29 ఓవర్లలోనే భారత్ పూర్తి చేయగలిగింది. టీమిండియా ఓపెనర్, తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ(52) హాఫ్ సెంచరీయే జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అయితే ఈ ఘన విజయానికి బౌలర్లే కారకులని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలతో ముంచెత్తాడు.
ప్రత్యర్థిని ఓడించాలన్న తపన.. కేదార్ జాదవ్లో
భారత్ విజయంపై కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ..‘ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి తెలియని ఆతృత మొదలైంది. గతంలో ఈ జట్టుతో ఓడినప్పుడు మేం చేసిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని వాటిని అధిగమించడానికి ప్రయత్నించాం. ఇందుకు బౌలర్లు చాలా బాగా సహకరించారు. వారి బౌలింగ్ అద్భుతం. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన కేదార్ జాదవ్లో ప్రత్యర్థిని ఓడించాలన్న తపన కనిపించింది.'
రాయుడు, కార్తీక్ మ్యాచ్ను బాగా ముగించి:
'తనకు అప్పజెప్పిన పని చాలా శ్రద్ధగా చేశాడు. ఈ మ్యాచ్లో తన పాత్రే కీలకం. మాకు ఇక్కడి పరిస్థితులు అనుకూలంగా లేవు. అయినా బౌలర్లు వాటిని వారి వైపు మళ్లించుకోవడంలో సఫలం అయ్యారు. ఈ విజయం వారిదే. ఇక్కడ బాట్స్మెన్స్ ఎక్కువగా కష్టపడాల్సి రాలేదు. ఎందుకంటే బౌలర్లు ఆ అవసరం రానివ్వలేదు. అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ మ్యాచ్ను చాలా బాగా ముగించారు' అని కొనియాడాడు.
ఇంకోసారి భారత్Xపాక్ మ్యాచ్
గ్రూప్ ఏ నుంచి ఇండియా.. పాకిస్తాన్ మరోసారి సూపర్ ఫోర్ విభాగంలో తలపడనుంది. సెప్టెంబర్ 23 బుధవారం జరగనున్న మ్యాచ్లో భారత్Xపాక్ మ్యాచ్ ఇంకోసారి ఆడనుండటంతో మ్యాచ్ను చూసేందుకు తీవ్రమైన స్థాయిలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ అభిమానులు.