సౌథాంప్టన్: ఇంగ్లాండ్లో సుదీర్ఘ పర్యటనలో భాగమైన ఆఖరి సిరీస్ టెస్టు ఫార్మాట్లో విజయం అందుకునేందుకు ఉన్న ఆఖరి అవకాశం కూడా చేజారిపోయింది. ఇంగ్లాండ్ జట్టుతో పోరాడిన కోహ్లీసేన 60 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్ కోహ్లీ చేసిన పరుగులు అతను మరో రికార్డు సృష్టించేందుకు దోహదపడ్డాయి. ఈ రికార్డుతో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కూడా దాటేశాడు విరాట్.
ఇంగ్లాండ్ నిర్దేశించిన 245 పరుగుల లక్ష్య ఛేదనలో హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి (58) వేగవంతంగా 4వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి కెప్టెన్గా నిలిచాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో భాగంగా నాల్గో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డు నెలకొల్పాడు. ఆ సిరీస్ ద్వారా ఇప్పటికే టెస్టుల్లో వేగవంతంగా ఆరువేల పరుగుల మైలురాయిని అందుకుని రెండో భారత క్రికెటర్గా నిలిచిన కోహ్లి.. కెప్టెన్గా మరో మైలురాయిని కూడా అందుకున్నాడు.
ఇప్పటివరకూ ఈ రికార్డు బ్రియాన్ లారా పేరిట ఉండగా దాన్ని కోహ్లి సవరించాడు. లారా కెప్టెన్గా 40 టెస్టుల్లో 4 వేల పరుగులు చేయగా, కోహ్లి 39 టెస్టు మ్యాచ్ల్లోనే ఆ రికార్డు సాధించాడు. ఈ జాబితాలో కోహ్లి, లారా తర్వాత వరుసగా రికీ పాంటింగ్ (42 టెస్టుల్లో), గ్రెగ్ చాపెల్ (45), అలెన్ బోర్డర్ (49)లు టాప్-5లో ఉన్నారు. ఫలితంగా ఈ ఫీట్ను వేగవంతంగా సాధించిన తొలి ఆసియా కెప్టెన్గా కూడా కోహ్లి రికార్డు నమోదు చేశాడు.
మరొకవైపు టెస్టుల్లో కెప్టెన్గా నాలుగువేల పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా కోహ్లి రికార్డు సాధించాడు. కోహ్లి కెప్టెన్గా సాధించిన ఈ పరుగుల్లో 16 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలున్నాయి. ఒక సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత కెప్టెన్గా నిలిచిన కోహ్లి.. ఈ ఘనత సాధించిన ఆరో పర్యాటక కెప్టెన్గా గుర్తింపు సాధించడం మరో విశేషం. గతేడాది న్యూఢిల్లీలో కోహ్లి నమోదు చేసిన 243 పరుగులు అతని కెరీర్లో అత్యధిక స్కోరుగా ఉంది. కాగా, ఇప్పటివరకూ ఇంగ్లాండ్తో సిరీస్లో కోహ్లి చేసిన పరుగులు 544.