
చెన్నై: ఇంగ్లండ్తో శుక్రవారం ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం భారత్ సన్నాహకాలను ప్రారంభించింది. చెన్నై చెపాక్ స్టేడియంలో కోహ్లీసేన నెట్ ప్రాక్టీస్ షురూ చేసింది. ఆరు రోజుల క్వారంటైన్ అనంతరం కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో సోమవారమే ఔట్డోర్ సెషన్కు దిగిన భారత ఆటగాళ్లు.. మంగళవారం తొలి నెట్ సెషన్లో చెమటోడ్చారు. ముందుగా హెడ్కోచ్ రవిశాస్త్రి ప్లేయర్లందరికి దిశానిర్దేశం చేశాడు. కసరత్తుల అనంతరం ఆటగాళ్లు ఫుట్బాల్ ఆడారు.
పితృత్వ సెలవులతో ఆసీస్పై చివరి మూడు టెస్టుల నుంచి వైదొలిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తండ్రి అయ్యాక తొలిసారి ప్రాక్టీస్లో అడుగుపెట్టాడు. ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి క్యాచులు ప్రాక్టీస్ చేశాడు. ఇద్దరూ పక్కపక్కనే నిల్చొని సాధన చేశారు. ఆపై అందరూ కలిసి రన్నింగ్ చేశారు. అనంతరం బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్ ఆధ్వర్యంలో ఆటగాళ్లు సాధన చేశారు. కోహ్లీ, పంత్, పుజారా, రహానే, రోహిత్ బ్యాటింగ్ చేయగా.. సిరాజ్, ఇషాంత్, బుమ్రా, అశ్విన్ బౌలింగ్ చేశారు.
వ్యక్తిగత కారణాల వల్ల క్వారంటైన్లోకి ఓ రోజు ఆలస్యంగా వచ్చిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బుధవారం జట్టుతో కలువనున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లోకి వచ్చిన పాండ్యా బౌలింగ్లోనూ పాలుపంచుకొని.. తుది జట్టులోని ఇద్దరు పేసర్లపై పడే భారాన్ని తగ్గించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే 2019లో వెన్ను సర్జరీ చేయించుకున్న పాండ్యా మళ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాడో లేదో చూడాలి.
గాయం కారణంగా ఆసీస్ టూర్కు పూర్తిగా దూరమైన సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ప్రాక్టీస్లో చురుగ్గా పాల్గొనడం టీమిండియాకు ఊరట కలిగించే అంశం. గాయాల వల్లే బ్రిస్బేన్ టెస్టు ఆడలేపోయిన స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా పూర్తి ఫిట్నెస్తో కనిపించారు. ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలుపు తర్వాత ఆడనున్న సిరీస్ కావడం, టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు కీలకమవడంతో సొంతగడ్డపై ఇంగ్లిష్ జట్టును చిత్తుచేయాలని కోహ్లీసేన పట్టుదలగా ఉంది.