నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న ఆసక్తికర విషయం
అయితే, ఓ ఆసక్తికరమైన విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. లార్డ్స్ టెస్టులో ఆడే టీమిండియా జట్టు. సాధారణంగా కెప్టెన్లు ఇద్దరూ కలిసి టాస్ వేసిన తర్వాత జట్టును ప్రకటిస్తారు. గత టెస్టులో ఆడిన జట్టుకు ప్రస్తుత మ్యాచ్కు ఏమైనా మార్పులు ఉంటే చెబుతారు. కానీ, గురువారం టాస్ కూడా పడకపోవడంతో టీమిండియా ఏ జట్టుతో బరిలోకి దిగిందో తెలియరాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ‘లార్డ్స్ టెస్టులో ఆడే టీమిండియా జట్టిదే' అంటూ ఓ ఫొటో వైరల్ అయింది.
తొలి టెస్టులో విఫలమైన శిఖర్ ధావన్
ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఏ జట్టుతో ఆడిందో అదే జట్టు లార్డ్స్ టెస్టులో కూడా బరిలోకి దిగనుంది. కాగా, ఇప్పటి వరకు కోహ్లీ నాయకత్వంలో భారత్ 36 టెస్టులు ఆడగా ఒక్కసారి కూడా ఒకే తుది జట్టుతో వరుసగా రెండు మ్యాచ్లు ఆడింది లేదు. నిజానికి తొలి టెస్టులో విఫలమైన శిఖర్ ధావన్ స్థానంలో పుజారాను జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. ఈ నేపథ్యంలో ఈ ఫోటో బయటకు రావడంతో కోహ్లీ వ్యూహం ఏంటో తెలియడం లేదు.
ఏమాత్రం వీలు చిక్కినా మ్యాచ్ జరిగి ఉండేది
మరోవైపు రెండో టెస్టు కోసం టాస్ పడకపోవడంతో అధికారికంగా తుది జట్టులో ఆడే 11 మంది ఆటగాళ్లనూ ప్రకటించలేదు. లార్డ్స్లో తొలిరోజు కొన్ని ఓవర్లను అయినా ఆడించాలని అంఫైర్లు విశ్వప్రయత్నాలు చేశారు. ఈ గ్రౌండ్లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో ఏమాత్రం వీలు చిక్కినా మ్యాచ్ జరిగేందుకు వీలుండేది. దీనిని దృష్టిలో పెట్టుకుని లంచ్ విరామాన్ని అరగంట ముందుకు జరిపి వృథా అయిన సమయాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, విరామం లేని జల్లులతో ఈ ప్రయత్నాలేమీ సఫలం కాలేదు. మిగతా రోజుల్లో సమయాన్ని అరగంట ముందుకు జరిపి... 96 ఓవర్ల చొప్పున నిర్వహించనున్నారు.
లండన్లో బుధవారం రాత్రి నుంచే వర్షం
మరోవైపు లండన్ వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచే వర్షం కురుస్తుండటంతో ఆటగాళ్లు గురువారం ఉదయం ప్రాక్టీస్కు కూడా దిగలేదు. 2001 తర్వాత వర్షం కారణంగా లార్డ్స్లో ఒక్క బంతి పడకుండా టెస్టు మ్యాచ్ ఒక రోజు ఆట రద్దు అవడం ఇప్పుడే తొలిసారి. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా లండన్లో వేడిగాలులు వీస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం చాలాసేపు మేఘావృతమై ఉంది. దీంతో కనీసం వారాంతం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.