257 వికెట్లు పడగొట్టి 39 ఏళ్ల రికార్డు
2018లో భారత బౌలర్లు 257 వికెట్లు పడగొట్టి 39 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టారు. 14 టెస్టుల్లో 9 మంది రెగ్యులర్ బౌలర్లు, ఓ పార్ట్ టైం బౌలర్ కలిసి ఈ వికెట్లను తీశారు. 1979లో 17 మ్యాచ్ల్లో బౌలర్లు 237 వికెట్లు తీయడమే ఇప్పటి వరకూ అత్యధికం. అరంగేట్రం చేసిన ఏడాదిలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దిలీప్ దోషి (40 వికెట్లు) రికార్డును బుమ్రా బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే.
నాలుగో రోజు ఆట ముగిశాక రికార్డు బ్రేక్
మెల్బోర్న్ టెస్టు నాలుగో రోజు ఆట ముగిశాక భారత బౌలింగ్ త్రయం ఈ రికార్డ్ను బ్రేక్ చేసింది. ఈ ఏడాదే టెస్టుల్లోకి అడుగుపెట్టిన బుమ్రా 9 మ్యాచ్ల్లో 46 వికెట్లు తీశాడు. షమీ 12 మ్యాచ్ల్లో 46 వికెట్లు తీయగా.. ఇషాంత్ 11 టెస్టుల్లో 39 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్తో బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఘన విజయం సాధించి రెండో టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 137 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ విజయంలో భారత బౌలర్లు కీలక పాత్ర పోషించారు.
కమిన్స్(63)ను పెవిలియన్ చేర్చిన బుమ్రా
భారత బౌలర్లలో బుమ్రా, జడేజా మూడేసి.. షమీ, ఇషాంత్ రెండేసి వికెట్లు తీశారు. నాలుగు టెస్టుల సిరీస్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయంతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని భారత్ నిలబెట్టుకున్నట్లైంది. అయిదో రోజు మొదలైన నాలుగో ఓవర్కే ఆసీస్ వికెట్ చేజార్చుకుంది. శనివారం నుంచి క్రీజులో పాతుకుపోయిన కమిన్స్(63)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు.
తర్వాతి ఓవర్లోనే నాథన్ లయన్(7)ను ఇషాంత్..
ఆ తర్వాతి ఓవర్లోనే ఇషాంత్.. నాథన్ లయన్(7)ను ఔట్ చేశాడు. దీంతో ఆసీస్ ఐదో రోజు కేవలం 3పరుగులు మాత్రమే జోడించి 261 పరుగులకే ఆలౌటైంది. బాక్సింగ్ డే టెస్టులో కోహ్లీసేన 137 పరుగుల తేడాతో గెలిచింది. టీమిండియా టెస్టు చరిత్రలో ఇది 150వ విజయం. మూడోటెస్టులో మొత్తం 9 వికెట్లు తీసిన బుమ్రా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.