

హైదరాబాద్: భారత పర్యటనకు వచ్చిన ఆప్ఘనిస్థాన్ జట్టు లక్ష్యం టీమిండియాను ఓడించడమే తప్ప, విరాట్ కోహ్లీపై ఆధిపత్యం చెలాయించడం కాదని ఆ జట్టు కోచ్ ఫిల్ సినమ్స్ వెల్లడించాడు. భారత్, ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య బెంగళూరు వేదికగా చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా కోహ్లీలేని టీమిండియాను అప్ఘన్ ఓడిస్తుందంటారా? అన్న ప్రశ్నకు "మేము పర్యటనకి వచ్చింది భారత జట్టుని ఓడించేందుకు. అంతేకాని.. కోహ్లీని ఓడించడానికి కాదు. అతను భారత జట్టులో లేనందుకు ఒకింత నిరాశగానే ఉంది. మరోవైపు అతనికి బౌలింగ్ చేయాల్సిన పని తప్పినందుకు సంతోషంగానూ ఉంది. భారత జట్టుతో తొలి టెస్టు ఆడుతున్నందుకు హ్యాపీగా ఉంది" అని సిమన్స్ పేర్కొన్నాడు.
ఈ టెస్టు నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. అతని స్థానంలో రహానెని కెప్టెన్గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. బెంగళూరు వేదికగా గురువారం ప్రారంభమైన ఏకైక టెస్టులో ఆప్ఘన్పై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా(10), రవిచంద్రన్ అశ్విన్ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు.
తమ అరంగేట్రం టెస్టులో ఆరంభం అంత బాగా లేకపోయినా... తొలిరోజుని అద్భుతంగా ముగించింది. నిజం చెప్పాలంటే ఆప్ఘన్ పైచేయి సాధించిందనే చెప్పాలి. టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్ (107), మురళీ విజయ్ (105) సెంచరీలు చేయగా, కేఎల్ రాహుల్ (54) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
ఒకానొక దశలో భారీ స్కోరు ఖాయమని భావించినప్పటికీ చివరి సెషన్లో అనూహ్యంగా పుంజుకున్న ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లు ఆతిథ్య జట్టును కట్టడి చేశారు. ఆప్ఘనిస్థాన్ బౌలర్లలో యామిన్ రెండు వికెట్లు తీసుకోగా.... వఫాదర్, రషీద్ ఖాన్, ముజీబ్ జద్రాన్ తలో వికెట్ తీసుకున్నారు.