హైదరాబాద్: ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో విజయావకాశాలు భారత్కే ఎక్కువగా ఉన్నాయని టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ జోస్యం చెప్పాడు. మూడో రోజు ఓవల్ పిచ్ ప్లాట్గా ఉంటుందని అంచనా వేశాడు. భారత జట్టులో ప్రపంచస్థాయి బ్యాట్స్మెన్ ఉన్నారని.. వాళ్లు కచ్చితంగా బ్యాటింగ్కు అనుకూలిస్తున్న ఓవల్ మైదానంలో రాణిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. రెండో రోజు భారత్ తక్కువ పరుగులకే రూట్ సేనను నిలువరిస్తుందని అంచనా వేసినా.. బౌలర్లు పట్టు విడవడంతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఓలీ పోప్ (81), క్రిస్ వోక్స్ (50)లు హాఫ్ సెంచరీలు బాదడంతో ఇంగ్లండ్ పటిష్ట స్థితికి చేరుకుంది.
ఆ అభిమానం వేరే లెవెల్.. భారత ఫాన్స్ క్రికెట్ను మరో స్థాయికి తీసుకెళ్లారు: స్టెయిన్
రెండో రోజు 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో భారత్కే ఆధిక్యం దక్కుతుందేమో అన్న ఆశలు రేగాయి. కానీ భారత్ ఆశలను ఓలీ పోప్ చిదిమేశాడు. పోప్ అద్భుత బ్యాటింగ్తో ఇంగ్లండ్ జట్టును ఆదుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన పోప్.. జానీ బెయిర్స్టో (37; 77 బంతుల్లో 7×4), మొయిన్ అలీ (35; 71 బంతుల్లో 7×4), క్రిస్ వోక్స్ (50; 60 బంతుల్లో 11×4)లతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. బెయిర్స్టోతో అతడి భాగస్వామ్యమే (89 పరుగులు) మ్యాచ్పై భారత్ పట్టు కోల్పోయేలా చేసింది. పోప్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న సమయంలో శార్ధూల్ ఠాకూర్ ఔట్ చేశాడు. లేదంటే ఇంగ్లండ్ మరిన్ని పరుగులు చేసేదే.
భారత్ మూడో రోజు మొత్తం బ్యాటింగ్ చేయగలిగితే ఇంగ్లండ్పై పైచేయి సాధించవచ్చని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో చాట్లో అభిప్రాయపడ్డాడు. '3వ రోజు ఓవల్ పిచ్ బాగుంటుంది. పిచ్ ప్లాట్గా ఉండనుంది. భారత్ బ్యాటింగ్ చేసేందుకు ఇదే మంచి అవకాశం. భారత జట్టులో ప్రపంచస్థాయి బ్యాట్స్మెన్ ఉన్నారు. వాళ్లు కచ్చితంగా బ్యాటింగ్కు అనుకూలిస్తున్న ఓవల్ మైదానంలో రాణిస్తారు. టీమిండియా ఆటగాళ్లంతా మ్యాచ్ గెలవాలనే కసితో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తుంది. అయితే మొదటి సెషన్ చాలా కీలకం. భారత్ బ్యాటింగ్లో రాణిస్తే.. ఇంగ్లండ్ జట్టుపై ఒత్తిడి పెంచొచ్చు' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
టీమిండియా ఆటగాళ్లంతా రోజంతా ఆడాలని, కనీసం 250 పరుగుల ఆధిక్యాన్ని సాధిస్తే ఇంగ్లండ్కు విజయం కష్టమే అని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ఓవర్ నైట్ స్కోర్ 43/0తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్.. 30 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 80 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (35), లోకేష్ రాహుల్ (44) క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 19 పరుగులు వెనకపడి ఉంది. రోహిత్ ఆచితూచి ఆడుతుండగా.. రాహుల్ బౌండరీలతో రెచ్చిపోతున్నాడు. ఓ సిక్స్ కూడా బాదాడు. రాహుల్ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. ఇద్దరూ ఇలానే ఆడి మొదటి భారీ ఆధిక్యం అందిస్తే.. లక్ష్మణ్ చెప్పినట్టు భారత్ విజయం సాధించే అవకాశాలు ఉంటాయి.