మూడేళ్లుగా ఫామ్లో లేడు..
టెస్ట్ ఫార్మట్ జట్టు నుంచి స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ను తప్పించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన రవి అశ్విన్పై వేటు వేసినప్పుడు.. టీ20 ఫార్మట్ నుంచి విరాట్ కోహ్లీని ఎందుకు తప్పించకూడదని ప్రశ్నించారు. మూడు సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గట్టుగా ఆడట్లేదని గుర్తు చేశారు. కోహ్లీకి బదులుగా సత్తాచాటుతున్న అప్కమింగ్ క్రికెటర్లకు అవకాశం కల్పించే దిశగా సెలెక్టర్లు దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు.
జట్టు నుంచి తప్పించడమో లేక..
టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్కు సమాయాత్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- విరాట్ కోహ్లీని కొనసాగించే విషయంపై పునరాలోచన చేయాల్సి ఉందని అన్నారు. అతణ్ని తప్పించాల్సిన సమయం ఆసన్నమైందని లేదా బెంచ్కే పరిమితం చేయాల్సి ఉంటుందని కపిల్ దేవ్ స్పష్టం చేశారు. ప్రపంచ క్రికెట్లో రెండో స్థానంలో ఉన్న స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ను టెస్టుల నుంచి తప్పించగా లేనిది- వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఎందుకు పక్కన పెట్టకూడదని ప్రశ్నించారు.
ఒకప్పటి కోహ్లీ కాదు..
ఇప్పుడున్న విరాట్ కోహ్లీ.. ఇదివరకు తాము చూసిన విరాట్ కోహ్లీ ఒక్కరు కాదని తేల్చి చెప్పారు. అతణ్ని తప్పించి.. యంగ్ క్రికెటర్లకు అవకాశం కల్పించాలని చెప్పారు. భారత క్రికెట్ బోర్డు సెలెక్షన్ కమిటీ.. విరాట్ కోహ్లీని వెస్టిండీస్ పర్యటన కోసం ఎంపిక చేయలేదంటే.. దాని అర్థం- అతనిపై వేటు వేసినట్టేనని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. సెలెక్షన్ కమిటీ ఏ ప్లేయర్కయినా విశ్రాంతిని ప్రకటించిందంటే.. దాన్ని తప్పించినట్లుగానే భావించుకోవచ్చని చెప్పారు.
ఆల్రౌండర్లకు ప్రాధాన్యత..
పేరున్న క్రికెటర్ కావడం వల్ల జట్టులోకి తీసుకుంటున్నామనే వాదనలో అర్థం లేదని, ఇప్పుడున్న ఫామ్ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ కంటే మెరుగ్గా ఆడదగ్గ ప్లేయర్లకు అవకాశం కల్పించడానికి ఇదే సరైన సమయమని చెప్పారాయన. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం జట్టు కూర్పులో ఆల్రౌండర్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. దీనిపై సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్లేయర్ల పెర్ఫార్మెన్స్ మీదే ఆధారపడి ఉంటుందని అన్నారు.