
ఆ ఒక్క సిక్స్తోనే ప్రపంచకప్ గెలవలేదు:
2011 వన్డే ప్రపంచకప్ విజయానికి శుక్రవారంతో పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా గౌతమ్ గంభీర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'ఒక వ్యక్తి మాత్రమే ప్రపంచకప్ గెలిచారని మీరు అనుకుంటున్నారా?. ఒక వ్యక్తి ప్రపంచకప్ గెలవగలిగితే.. భారత్ ఇప్పటివరకు అన్ని టోర్నీలు గెలిచేది. దురదృష్టం ఏంటంటే.. భారతదేశంలో కొంతమంది వ్యక్తులను ఎక్కువగా ఆరాధిస్తుంటారు. నేను అలాంటివి ఎప్పుడూ నమ్మను. జట్టు ఆటలో వ్యక్తులకు స్థానం లేదు. ఫైనల్లో జహీర్ ఖాన్ సహకారాన్ని మీరు మరచిపోగలరా?. ఆస్ట్రేలియాపై యువరాజ్ సింగ్ ఆటను మరచిపోగలరా?. దక్షిణాఫ్రికాపై సచిన్ టెండూల్కర్ చేసిన సెంచరీ సంగతేంటి?. ఆ ఒక సిక్స్ గురించే ఎందుకు చర్చిస్తారు. 2007 ప్రపంచకప్లో ఆరు సిక్సులు బాదిన యువరాజ్ ఎవరూ మాట్లాడరే' అని ప్రశ్నించాడు.

పదేళ్లు అవుతుందా?:
'2011 ప్రపంచకప్ విజయం నిన్ననే అందినట్లు అనిపించడం లేదు. నా వరకైతే అలా ఏమాత్రం లేదు. పదేళ్లు అవుతుందా?.. ఏమో గతంలోకి ఎక్కువగా తొంగిచూడను. అది గర్వపడే సందర్భం కానీ ఇప్పుడు భారత్ ముందుకు సాగాల్సిన సమయమిది. వీలైనంత త్వరగా మరో ప్రపంచకప్ను గెలవాలి' అని బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఎంఎస్ ధోనీ (91 నాటౌట్: 79 బంతుల్లో 8x4, 2x6)తో కలిసి గౌతీ (97: 122 బంతుల్లో 9x4) నాలుగో వికెట్కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

పదేళ్లవుతున్నా మరో ప్రపంచకప్ గెలవలేకపోయాం:
'2011లో అసాధ్యమైనదేదీ మేం అందుకోలేదు. ప్రపంచకప్ కోసం జట్టులోకి ఎంపికైనప్పుడే గెలవాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఆ క్రమంలోనే మేం దేశం గర్వపడేలా చేశాం. ప్రజలు ఆనందపడ్డారు. 2015, 2019 వన్డే ప్రపంచకప్ల్లోనూ గెలిస్తే అప్పుడు ప్రపంచ క్రికెట్లో టీమిండియాను సూపర్ పవర్గా పరిగణించేవాళ్లేమో. కానీ పదేళ్లవుతున్నా మరో ప్రపంచకప్ గెలవలేకపోయాం. అందుకే ఈ ప్రత్యేక సందర్భంలో గతం గురించి ఎక్కువగా మాట్లాడకూడదని అనుకుంటున్నా. మేం మా బాధ్యతలు నిర్వర్తించాం అంతే. ఏప్రిల్ 2న మేం చేసింది ఇతరుల మేలు కోసం కాదు. గతం కంటే భవిష్యత్ మీద ధ్యాస పెట్టడం అవసరం' అని బీజేపీ ఎంపీ పేర్కొన్నాడు.

ఏడాది ముందు తుది కూర్పును సరిచేసుకోవాలి:
'ప్రపంచకప్నకు కనీసం ఏడాది ముందు జట్టు తుది కూర్పును సరిచేసుకోవాలి. అప్పుడే ఆటగాళ్లపై ఓ అంచనాకు రావాలి. మేం కలిసి ఎక్కువ మ్యాచ్లాడాం కాబట్టి విజయవంతం కాగలిగాం. ఎక్కువ మంది ఆటగాళ్లను పరీక్షించాలని ప్రయత్నించినా.. ఇబ్బందులే ఎదురవుతాయి. అయితే ఆ ప్రపంచకప్ ఫైనల్లో ఆడిన మేం.. ఆ తర్వాత తిరిగి ఒక్క మ్యాచ్లోనూ అదే జట్టుతో బరిలో దిగకపోవడం బాధాకరమైన విషయం' అని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












