భారత్ను స్వదేశంలో ఓడించడం ఏ ఫార్మాట్లో అయినా కష్టమే. అది కూడా టెస్టుల్లో అయితే మరింత కష్టం. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఒప్పుకున్నాడు. అయితే దీన్ని ఒక సవాల్గా తీసుకొని తాము సిద్ధం అవుతున్నట్లు కూడా ఆ జట్టు ఇప్పటికే చెప్పింది. ఈ క్రమంలో భారత జట్టులో ఒక ప్రధాన సమస్య ఉందని, దాన్ని ఆస్ట్రేలియా జట్టు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని మాజీ సెలెక్టర్ సాబా కరీం అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియాతో సిరీస్ అంటే మాటల తూటాలు పేలడం పరిపాటే. వారికి తగ్గట్లు నోటితోనే కాదు.. బ్యాటుతోనూ సమాధానం చెప్తూ వచ్చిన ఆటగాళ్లలో రిషభ్ పంత్ ఒకడు. టెస్టు ఫార్మాట్లో భారత్కు అతను ఎంతో కీలకంగా మారాడు. అయితే గతేడాది చివర్లో జరిగిన భయంకరమైన యాక్సిడెంట్ కారణంగా అతను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడటం లేదు. పంత్ గైర్హాజరీలో కొంత కాలంగా జట్టుతో కలిసి ట్రావెల్ చేస్తున్న కేఎస్ భరత్, యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ను భారత సెలెక్టర్లు ఈ సిరీస్ కోసం ఎంపిక చేశారు. వీళ్లిద్దరూ ఇప్పటి వరకు భారత్ తరఫున ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. భరత్ అయితే అసలు అంతర్జాతీయ అరంగేట్రమే చేయలేదు.
వికెట్ కీపర్ బ్యాటర్లకు ఏమాత్రం అనుభవం లేకపోవడాన్ని క్యాష్ చేసుకోవడానికి ఆస్ట్రేలియా ప్రయత్నిస్తుందని సాబా కరీం చెప్పాడు. ప్రస్తుతం టీమిండియాలో వీక్ లింగ్ వికెట్ కీపర్ బ్యాటరే అన్నాడు. 'ఆస్ట్రేలియా జట్టు తమకు అనుకూలంగా వాడుకోగలిగే ఒకే ఒక అంశం ప్రత్యర్థి వికెట్ కీపర్. భారత జట్టు టెస్టు మ్యాచులు ఆడే విధానాన్ని రిషభ్ పంత్ మార్చేశాడు. అతను లేని లోటు జట్టులో కనిపించకూడదని ఆశిస్తున్నా. లేదంటే ఆసీస్ దాన్ని ఉపయోగించుకొని ఒత్తిడి పెంచుతుంది' అని అభిప్రాయపడ్డాడు.