మూడో వన్డే వదిలెయ్యాలి!
భారత్ ప్రస్తుతం ఆడుతున్న వన్డే సిరీస్ కన్నా.. ఆస్ట్రేలియాతో ఆడే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చాలా కీలకం. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ పార్మాట్పై బీసీసీఐ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అదే సమయంలో కోహ్లీ కూడా ఈ ఫార్మాట్లో ఫామ్ అందుకోవడంతో అందరూ సంతోషిస్తున్నారు. అయితే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ కూడా ఇదే ఏడాది ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ టోర్నీ ఫైనల్ చేరాలంటే భారత జట్టు కచ్చితంగా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ గెలవాలి. వన్డేల్లో సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లీ అదే ఫామ్ను టెస్టుల్లోనూ కొనసాగించాలి.
టెస్టుల్లో అందని ఫామ్..
బంగ్లాదేశ్తో చివరి వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ.. ఆ తర్వాత టెస్టు సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే కోహ్లీకి రవిశాస్త్రి కీలకమైన సలహా ఇచ్చాడు. కివీస్తో జరిగే మూడో వన్డేలో ఆడకుండా తప్పుకోవాలని చెప్పాడు. ఈ వన్డేను వదిలేసి రంజీల్లో పాల్గొనాలని సలహా ఇచ్చాడు. తద్వారా భారత పిచ్లపై టెస్టు క్రికెట్ గాడిలో పడుతుందని చెప్పాడు. 'ప్రస్తుత స్టార్ క్రికెటర్లు దేశవాళీలు ఆడటం కనిపించడం లేదు. కానీ కొన్నిసార్లు ఏది ముఖ్యమో గమనించాలి. దాని కోసం కొన్ని త్యాగాలు చేయక తప్పదు. అందుకో కోహ్లీ వెళ్లి రంజీలు ఆడితే బెటర్' అని రవిశాస్త్రి చెప్పాడు.
సచిన్ చేసిన పనే..
రవిశాస్త్రి ఇచ్చిన సలహా ఏం కొత్తది కాదు. గతంలో సచిన్ కూడా ఇదే చేశాడు. ఈ విషయాన్ని కూడా రవిశాస్త్రి గుర్తుచేశాడు. 'నేనేం కొత్త విషయం చెప్పడం లేదు. పాతికేళ్ల క్రితం సచిన్ టెండూల్కర్ కూడా ఇదే చేశాడు. సీసీఐ తరఫున ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ డబుల్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత రెండు నెలలకు ఆస్ట్రేలియాపై కూడా డబుల్ సెంచరీతో మెరిశాడు. 1998లో ఆస్ట్రేలియా మీద ఏకంగా వెయ్యి పరుగులు చేశాడు' అని రవిశాస్త్రి వెల్లడించాడు. కోహ్లీ కనుక ఇదే నిర్ణయం తీసుకుంటే.. ఈ నెల 24న హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో అతను ఆడతాడు.