కివీస్ సూపర్ షో
కివీస్ కీలక బ్యాటర్లందర్నీ మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చారు. దీంతో ఆ జట్టు ఒకానొక దశలో 131 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో మైకేల్ బ్రేస్వెల్ (140), మిచెల్ శాంట్నర్ (57) అద్భుతంగా పోరాడారు. ముఖ్యంగా బ్రేస్వెల్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో కివీస్కు విజయం ఖాయమని అనిపించింది. అయితే చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం అనగా అతను అవుటవడం మ్యాచ్ను మలుపు తిప్పింది. దీంతో న్యూజిల్యాండ్ జట్టు 337 పరుగులకు కుప్పకూలింది.
అదే పెద్ద సమస్య..
ఈ మ్యాచ్లో భారత బౌలర్లలో సిరాజ్ 4, కుల్దీప్ రెండు వికెట్లతో చెలరేగారు. కానీ కివీస్ గెలుపు ముంగిట వరకు రావడం చూస్తేనే.. భారత బౌలింగ్ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చని మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఈ సమస్య భారత్కు ఇప్పటిది కాదని సన్నీ చెప్పాడు. 'భారత్ బలం ఛేజింగ్. ఇదే స్కోరును భారత్ అయితే ఎలాగోలా ఛేజ్ చేసేసేది. కేవలం వన్డేల్లోనే కాదు. టీ20ల్లో కూడా భారత్ 200 వరకు స్కోరు చేస్తోంది. కానీ దాన్ని కాపాడుకోవడంలో విఫలం అవుతోంది. కాబట్టి బౌలింగ్ విభాగంలో మరింత బలం పెంచుకోవడం చాలా ముఖ్యం' అని సునీల్ గవాస్కర్ చెప్పాడు.
గతంలో కూడా..
ఇంతకుముందు కూడా చాలాసార్లు భారీ స్కోర్లను కాపాడుకోవడంలో భారత జట్టు విఫలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చివర్లో వచ్చే టెయిలెండర్ల వికెట్లు తీసుకోవడంలో భారత బౌలర్లు విఫలం అవుతుంటారు. దీంతో ప్రత్యర్థి జట్టు చివరి వరకు పోరాడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఎవరో ఒకరు కొంత రాణించినా భారత్ ఓడినంత పని అవుతుంది. ఆసియా కప్ వంటి టోర్నీల్లో కూడా ఇలాంటి సీన్ కనిపించింది. ఇక టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత బౌలింగ్ బలహీనత ఎంత స్పష్టంగా కనిపించిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.