
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ అంత్యక్రియలు శుక్రవారం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. సెంట్రల్ ముంబై శివాజీ పార్క్ జింఖానాలోని శ్మశాన వాటికలో ఆయన దహన సంస్కారాలను నిర్వహించారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ (77) బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.
దక్షిణ ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయనకు భార్య రేఖ, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉంది. 1971లో టీమిండియాకు ఇంగ్లాండ్, వెస్టిండీస్ గడ్డపై తొలి విజయాన్ని అందించిన కెప్టెన్గా వాడేకర్ రికార్డులకెక్కాడు. భారత్ తరఫున వాడేకర్ మొత్తం 37 టెస్టులు ఆడారు.

సెంచరీతో కలిపి 2,113 పరుగులు చేశారు. అంతేకాదు భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్, మేనేజర్, కోచ్, సెలెక్టర్గా సేవలందించారు. అలాగే టీమ్ఇండియాకు తొలి వన్డే కెప్టెన్గా వ్యవహరించిన ఈ ముంబైకర్.. రెండు మ్యాచ్లు ఆడారు. 90ల్లో అజారుద్దీన్ నాయకత్వంలోని జట్టుకు మేనేజర్గా సేవలందించారు.
ఆ తర్వాత చీఫ్ సెలెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. వాడేకర్ భౌతిక కాయాన్ని వర్లిలోని ఆయన స్వగృహంలో అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, సమీర్ డిఘే, హాకీ మాజీ కెప్టెన్ ఎం.ఎం. సోమయ్య, ముంబై క్రికెట్ సంఘం ప్రస్తుత, మాజీ అధికారులు పలువురు వాడేకర్కు నివాళులర్పించారు.
ఇక, బీసీసీఐ తరఫున జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్) సబా కరీం, స్థానిక క్రికెటర్లు పద్మాకర్ శివాల్కర్, జతిన్ పరంజపే.. వాడేకర్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా సైతం అజిత్ వాడేకర్కు తమ సంతాపాన్ని తెలియజేశారు.