హైదరాబాద్: పెర్త్ టెస్టులో టీమిండియా ఓటమి పాలవడంతో జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లుతో పాటు క్రికెట్ అభిమానులు సైతం తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పెర్త్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తనపై మిచెల్ జాన్సన్, అలెన్ బోర్డర్, మైక్ హస్సీలాంటి ఆసీస్ మాజీలు తీవ్రంగా విమర్శించారు.
సిరిస్ 1-1తో సమం: పెర్త్ టెస్టులో భారత్ ఓటమికి గల కారణాలివే
పెర్త్ టెస్టులో కోహ్లీ అమర్యాదగా ప్రవర్తించాడని మిచెల్ జాన్సన్ ఆరోపించాడు. ప్రపంచ క్రికెట్లో కోహ్లీకి ఉండే క్రేజ్ వేరు, మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో కోహ్లీ అగ్రస్థానాన ఉన్నప్పటికీ, పెర్త్ టెస్టులో అతడి చేష్టలు సిల్లీగా ఉన్నాయని జాన్సన్ విమర్శించాడు. అయితే, భారత మాజీ పేసర్లు జహీర్ ఖాన్, ప్రవీణ్ కుమార్ మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలిచారు.
విరాట్ కోహ్లీ దూకుడు తగ్గించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. "విరాట్ కోహ్లీ ఎన్ని విజయాలు సాధించినా, నువ్వెలా ఉండాలనుకున్నావో అలాగే ఉండు. గెలుపు సూత్రాన్ని ఎప్పుడూ పక్కన పెట్టొద్దు. ఇతరులేమన్నా పట్టించుకోవద్దు. ఆసీస్లో సిరీస్ అంటే ఎప్పుడూ ఇలాగే ఉంటుంది" అని జహీర్ అన్నాడు.
ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ "అండర్-16, అండర్-19తో పాటు రంజీస్థాయిలో విరాట్ కోహ్లీ దూకుడుగానే ఆడేవాడు. ఇదే దూకుడును అతను జాతీయస్థాయి జట్టులోనూ చూపితే సమస్యేంటి? అతనితో కలిసి నేను ఎన్నో మ్యాచ్లు ఆడా. దూకుడు లేకుండా అతను అత్యుత్తమ క్రికెట్ను ఆడలేడన్నది స్పష్టంగా చెబుతా" అని అన్నాడు.
బ్యాట్ క్రీజులో ఉన్నా... బ్యాట్స్మన్ను ఔటిచ్చిన థర్డ్ అంపైర్ (వీడియో)
పెర్త్ టెస్టులో విరాట్ కోహ్లీ స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగడంపై కూడా ప్రవీణ్ కుమార్ స్పందించాడు. "చూడండి. నలుగురు పేసర్లతో కోహ్లీ రెండో టెస్టులో విజయం సాధిస్తే పరిస్థితి మరోలా ఉండేది. తుది జట్టులో నలుగురు పేసర్లు ఉండాలన్నది జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం. దానిని మనం గౌరవించాలి" అని అన్నాడు.
"రెండో టెస్టులో భారత్ ఓటమి పాలైంది కాబట్టి స్పిన్నర్ అంశం తెరపైకి వచ్చింది. అదే నాలుగు, ఐదు రోజుల్లో కూడా పిచ్ పేస్, బౌన్సింగ్కు అనుకూలంగా ఉంటే స్పిన్నర్ అంశం తెరపైకి వచ్చేది కాదు. కేవలం ఒక్క ఓటమితోనే జట్టు నిర్ణయాన్ని తప్పుబట్టడం సరికాదు" అని ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు.