హైదరాబాద్: ఖరీదైన కారుని తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా. కారుని బహుమతిగా ఇస్తే వార్తల్లో నిలవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే ఈ కారుని సురేశ్ రైనా తన సొంత రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో కొనుగోలు చేయడమే ఇందుకు కారణం.
సాధారణంగా కొందరు సెలబ్రిటీలు ట్యాక్స్ తగ్గించుకోవడానికి తమ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో కార్లు కొనుగోలు చేయడాన్ని మనం చూశాం. తాజాగా క్రికెటర్ సురేశ్ రైనా కూడా ట్యాక్స్ తగ్గించుకోవడానికే కారుని వేరే రాష్ట్రంలో కొనుగోలు చేశాడంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.
అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్కు చెందిన సురేశ్ రైనా ఉత్తరాఖండ్లోని డెహ్రడూన్లో లగ్జరీ కారు మెర్సిడేజ్ బెంజ్ జీఎల్ఈ 350 డీ కారు కొనుగోలు చేశాడు. దీని విలువ సుమారు రూ.80లక్షలు. అయితే ఇందులో తప్పేముందని అనుకుంటున్నారా? ఉత్తరప్రదేశ్లో రూ.10 లక్షలకు పైగా విలువైన వాహనాలు కొనుగోలు చేస్తే 10శాతం పన్ను కట్టాలి.
కానీ ఉత్తరాఖండ్లో అలా కాదు. 8 శాతం ట్యాక్స్ కడితే సరిపోతుంది. దీంతో సురేశ్ రైనా కావాలనే కారుని డెహ్రడూన్లో కొనుగోలు చేశాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సురేశ్ రైనా స్పందిస్తూ... 'అలాంటిదేమీ లేదు. నాకు నచ్చిన నీలం రంగు కారు యూపీలో అందుబాటులో లేదు. డెహ్రడూన్లో ఉంది అని చెప్పారు. అందుకే నేను ఇక్కడ కారు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇది మా అమ్మనాన్నల కోసం కొన్న కారు' అని రైనా వివరించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.