టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీకి కోల్కతా కోర్టు షాకిచ్చింది. అతని దూరంగా ఉంటున్న భార్య హసిన్ జహాన్కు ప్రతి నెలా రూ.1.3 లక్షల భరణం ఇవ్వాలని కోర్టు తీర్పిచ్చింది. షమీ, అతని కుటుంబం తనను తీవ్రంగా హింసించారంటూ హసిన్ గృహహింస చట్టం కింద గతంలో కేసు పెట్టింది. ఈ క్రమంలోనే షమీ భారత్ తరఫున క్రికెట్ ఆడుతూ మ్యాచ్ ఫిక్సింగ్కు కూడా పాల్పడ్డాడని ఆరోపణలు చేసిందామె.
హసిన్ ఆరోపణలతో కొంతకాలం పాటు షమీ సెంట్రల్ కాంట్రాక్టును బీసీసీఐ నిలిపి వేసింది. అయితే ఆ తర్వాత ఆమె చేసినవన్నీ నిరాధారమైన ఆరోపణలు అని తెలియడంలో షమీ కాంట్రాక్టును పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో కోర్టుకెక్కిన హసిన్.. తనకు నెల నెలా రూ.10 లక్షల భరణం ఇవ్వాలని కోర్టులో కేసు వేసింది. దీనిలో మూడు లక్షల రూపాయల తమ పాప ఖర్చులకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పిన ఆమె తరఫు లాయర్.. 2020-21 ఇన్కం ట్యాక్స్ లెక్కలు చూస్తే షమీ ఆదాయం రూ.7 కోట్లపైగానే ఉందని, కాబట్టి నెలకు రూ.10 లక్షలు భరణం అతనికి ఎక్కువ కాదని వాదించారు.
అయితే హసిన్ కూడా తన ఫ్యాషన్ డిజైనింగ్ వ్యాపారంలో బాగానే సంపాదిస్తోందని, ఆమెకు ఆర్థిక సాయం అంత అవసరం లేదని షమీ తరఫు లాయర్ తేల్చిచెప్పారు. రెండు వైపుల వాదనలు విన్న కోల్కతాలోని కోర్టు ఆమెకు నెలకు రూ.1.3 లక్షల భరణం ఇవ్వాలని షమీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, 2014లో షమీ, హసిన్ వివాహం చేసుకున్నారు. వీళ్లకు ఒక పాప. ఈ క్రమంలో 2018లో భార్యాభర్తల మధ్య వివాదాలు చెలరేగాయి. ఈ క్రమంలో షమీపై గృహహింస కేసు పెట్టిన హసిన్.. మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని కూడా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షమీ కుమార్తె హసిన్తోనే ఉంది.