జట్టులో వేస్ట్ అన్నారు..
ఈ క్రమంలో ముఖ్యంగా గిల్ ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. అతని ఆట పొట్టి ఫార్మాట్కు సరిపోదని కొందరు అన్నారు. అతన్ని జట్టులో నుంచి తీసేయాలని మరికొందరు సలహా ఇచ్చారు. కానీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం తన ఓపెనర్లపై నమ్మకం ఉంచాడు. ఇషాన్ కిషన్ ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. సిరీస్ డిసైడర్లో కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యాడు. కానీ శుభ్మన్ గిల్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. టీ20 ఫార్మాట్లో సెంచరీ సాధించిన యువప్లేయర్గా రికార్డు సృష్టించాడు.
నమ్మకం ఉంచిన పాండ్యా..
ఈ సిరీస్ ప్రారంభానికి ముందు గిల్ టీ20 రికార్డు అంత గొప్పగా ఏం లేదు. శ్రీలంకపై అతను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో గిల్ కొంత టెన్షన్ పడి ఉంటాడు. అయితే పాండ్యా అతనికి ఒకే సలహా ఇచ్చాడట. 'కొత్తగా ఏం చెయ్యడానికి ట్రై చెయ్యకు. నీ సహజ సిద్ధమైన ఆట ఆడు అంతే..' అని చెప్పాడట. ఈ విషయాన్ని గిల్ స్వయంగా వెల్లడించాడు. పాండ్యా ఇచ్చిన నమ్మకం తనకు ఎంతో ఉపయోగపడిందన్నాడు. 'హార్దిక్ భాయ్.. నాపై నమ్మకం ఉంచాడు. మద్దతుగా నిలిచాడు. చివరకు వాటికి ఇలా బదులిచ్చినందుకు సంతోషంగా ఉంది' అని చెప్పాడు.
ప్రాక్టీస్కు ఫలితం..
'నేను చేసిన ప్రాక్టీస్కు తగిన ఫలితం దక్కితే చాలా సంతోషంగా ఉంటుంది. నేను భారీ స్కోరు చేయగలనని నమ్ముతూ వచ్చా. శ్రీలంకపై అది జరగలేదు. అయితే ఈ సిరీస్లో ఇలా మంచి స్కోరు చేసి జట్టుక ఉపయోగపడినందుకు ఆనందిస్తున్నా' అని గిల్ తెలిపాడు. అలాగే టీమిండియా టైట్ షెడ్యూల్ గురించి కూడా అతను మాట్లాడాడు. 'నీ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అలసిపోతామని నేను అనుకోవడం లేదు. మూడు ఫార్మాట్లలో భారత్ తరఫున ఆడటం ఎప్పుడూ సంతోషమే' అని చెప్పాడు. గిల్ మళ్లీ కీలకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కనిపిస్తాడు.