నవంబర్లో ముగియనున్న ఛైర్మన్ పదవీకాలం..
ఐసీసీ ఛైర్మన్ పదవీ కాలం రెండు సంవత్సరాలు. ఆ తరువాత దీన్ని మరో దఫా పొడిగించుకునే వెసలుబాటు ఉంది. ప్రస్తుతం గ్రెగ్ బార్క్లే ఐసీసీ ఛైర్మన్గా వ్యవహరిస్తోన్నారు. న్యూజిలాండ్ అక్లాండ్కు చెందిన న్యాయవాది బార్క్లే. ఆయన పదవీకాలం ఈ సంవత్సరం నవంబర్లో ముగుస్తుంది. జులైలోనే బార్క్లే పదవీకాలం ముగియాల్సి ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ నిర్వహించాల్సి ఉన్నందున.. నవంబర్ వరకు కొనసాగుతారు.
నలుగురు భారతీయులు..
అనంతరం మరో రెండేళ్ల కాలం పొడిగించుకోవడానికి బార్క్లే పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఫలితంగా ఆయన తప్పుకోవడం దాదాపుగా ఖాయమైంది. దీనితో తదుపరి ఐసీసీ ఛైర్మన్ పదవి కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఈ దఫా భారత్ దీన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. ఇదివరకు ప్రముఖ పారిశ్రామికవేత్త జగ్మోహన్ దాల్మియా, కేంద్ర మాజీమంత్రి శరద్ పవార్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఓనర్, ఇండస్ట్రీయలిస్ట్ ఎన్ శ్రీనివాసన్, సీనియర్ న్యాయవాది శశాంక్ వెంకటేష్ మనోహర్ ఈ హోదాలో పని చేశారు.
సౌరవ్-జయ్ షా పోటీపై..
ఇదివరకు శశాంక్ మనోహర్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు రెండుసార్లు ఛైర్మన్గా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ ఆ పదవిని భారత్ కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రస్తుత బీసీసీఐ ఛైర్మన్, టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు, కార్యదర్శి జయ్ షా ఐసీసీ ఛైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నట్లు వార్తలొచ్చాయి. వారిద్దరూ తమ నామినేషన్లను దాఖలు చేసుకోవడానికి సమాయాత్తమౌతున్నారనే ప్రచారం సాగింది.
అనురాగ్ ఠాకూర్ పేరు..
ఇప్పుడు తాజాగా మరో పేరు వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్లో కీలకమైన యువజన వ్యవహారాలు, సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా పని చేస్తోన్న అనురాగ్ ఠాకూర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. బీసీసీఐ స్వయంగా ఆయన పేరును ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. తన తరఫున అనురాగ్ ఠాకూర్ పేరును బీసీసీఐ ప్రతిపాదిస్తుందని, దీనికి అవసరమైన చర్యలు మొదలు పెట్టిందనీ అంటున్నారు.
ఐసీసీపై భారత ముద్ర..
తమ హయాంలో ఐసీసీ ఛైర్మన్లుగా పని చేసిన భారతీయులు దాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారు. తమదైన ముద్ర వేశారు. ఇది తదుపరి అనురాగ్ ఠాకూర్ ఐసీసీ ఛైర్మన్గా ఎంపిక కావడానికి బాటలు వేయొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సౌరవ్ గంగూలి-జయ్ షా పోటీ పడుతున్నట్లు వార్తలొచ్చిన మరుసటి రోజే తాజాగా అనురాగ్ ఠాకూర్ పేరు ప్రచారంలోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.