భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాహుల్ జోహ్రి తన వార్షిక వేతనం పెంచాలని కోరుతున్నారు. మంగళవారం పరిపాలక కమిటీ (సీఓఏ) సమావేశం కానుండటంతో జోహ్రి వేతన సవరణపై కూడా చర్చించే అవకాశముంది. అయితే జోహ్రి జీతం పెంపుపై సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.
రాహుల్ జోహ్రి ప్రస్తుత వార్షిక వేతనం రూ. 5 కోట్ల 76 లక్షలు. ఇక ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు అదనంగా ఉంటాయి. అయినా కూడా తనకు వేతనం పెంచాల్సిందే అని జోహ్రి పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సీఓఏ సమావేశం అయి.. కీలక అంశాలతో పాటు జోహ్రి వేతన విషయంపై కూడా చర్చించే అవకాశం ఉంది. జీతం పెంపుపై డయానా ఎడుల్జీ, రవి తోడ్గేల అభిప్రాయం కూడా వినోద్ రాయ్ తీసుకోనున్నారు.
జోహ్రి వార్షిక వేతనం పెంపుపై సీఓఏ సభ్యులు సముకంగానే ఉన్నా.. బీసీసీఐ మాత్రం విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జోహ్రి ద్వారా బోర్డుకు వచ్చిన అదనపు ప్రయోజనం, కార్యకలాపాల్లో వైవిధ్యం ఏమీ లేవని బీసీసీఐ అధికారి ఒకరు అంటున్నారు. అలాంటపుడు జీతం పెంపు ప్రతిపాదన ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే సీఓఏ సమావేశంతో స్పష్టత రానుంది.