ఎఫ్టీపీపై బీసీసీఐ దృష్టి:
ఆటగాళ్ల జీతాల విషయంలో బీసీసీఐ ఎటువంటి కోతలు పెట్టకుండా చెల్లిస్తోంది. అయితే రాబోవు రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో మాత్రం కచ్చితంగా చెప్పలేం. అయితే బీసీసీఐ ఇప్పట్నుంచే ఆదాయ మార్గాల అన్వేషణలో పడింది. ఇక్కడ తాను మాత్రమే ఆదాయపడకుండా.. మిగతా బోర్డుల నష్ట నివారణను కూడా పూడ్చాలని చూస్తోంది. దాని కోసం వచ్చే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సమావేశంలో చర్చించనుంది. ఇందుకు గాను భవిష్యత్తు టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ)పై బీసీసీఐ దృష్టి పెట్టనుంది.
మరిన్ని ద్వైపాక్షిక సిరీస్లు:
ప్రస్తుతానికి ఖరారై ఉన్న సిరీస్లు కాకుండా రాబోవు కాలంలో అదనంగా మరిన్ని ద్వైపాక్షిక సిరీస్ల నిర్వహణ కోసం బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఇప్పటివరకూ చవిచూసిన నష్టాన్ని మారిన్ని ద్వైపాక్షిక సిరీస్ల నిర్వహణ ద్వారా ఎంతోకొంత భర్తీ చేసుకోవడమే కాకుండా.. మిగతా బోర్డులకు ఇది ఆసరాగా ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది. కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత చిన్న జట్లతో మరిన్ని ద్వైపాక్షిక మ్యాచ్లు ఆడుతామని భారత్ హామీ ఇచ్చింది.
చిన్న బోర్డులకు సాయం:
2023-2031 కాలానికి సంబంధించి ఎఫ్టీపీ వచ్చే ఏడాది ఖరారు చేస్తారు. దీనిలో భాగంగా ముందుగా జరిగే ఐసీసీ సమావేశంలోనే ఒక స్పష్టత వస్తే బాగుటుందనేది బీసీసీఐ యోచిస్తోంది. ఇలా చేస్తే తమతో పాటు చిన్న దేశాల క్రికెట్ బోర్డులకు సాయంగా ఉంటుందని ఒక బీసీసీఐ అధికారి తెలిపారు. వచ్చే ఎఫ్టీపీలో భారత్కు ఎక్కువ మ్యాచ్లు ఉండాలనేది బీసీసీఐ ప్లాన్. వచ్చే ఏడాది కాలంలో భారత క్రికెట్ జట్టుకు నాలుగు విదేశీ పర్యటనలు ఉన్నాయి. ఇందులో శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికాలతో ద్వైపాక్షిక సిరీస్లు ఉన్నాయి.
చిన్న జట్లతో మ్యాచ్లు ఆడేందుకు:
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో మెగా టోర్నీ జరుగుతుందా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ప్రపంచకప్ జరగపోయినా బీసీసీఐకి పెద్దగా నష్టమేమీ వాటిల్లదు. బీసీసీఐ ప్రధాన ఆదాయ వనరు మాత్రం ద్వైపాక్షిక సిరీస్లే. దాంతో సాధ్యమైనన్ని ఎక్కువ ద్వైపాక్షిక సిరీస్ల నిర్వహణ కోసం బీసీసీఐ తమ ప్రయత్నాలను ఆరంభించింది. ముఖ్యంగా చిన్న జట్లతో ఎక్కువ మ్యాచ్లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.