12 బంతుల్లో 30 పరుగులు
ఆఖరి టీ20లో భారత్ గెలువాలంటే 12 బంతుల్లో 30 పరుగులు చేయాలి. క్రీజ్లో ఉన్న కృనాల్ పాండ్యా, దినేశ్ కార్తీక్లు చెలరేగి బ్యాటింగ్ చేశారు. సౌతీ వేసిన 18 ఓవర్లో 18 పరుగులు పిండుకుని స్కోరు బోర్డులో వేగం పెంచారు. ఇది పెద్ద లక్ష్యం కూడా కాకపోవడంతో... టీమిండియా గెలుపు ఖాయమే అనుకున్నారు. అనుకున్నట్లుగానే చెరో సిక్స్ బాదడంతో 19వ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి.
6 బంతుల్లో 16 పరుగులు
విజయ సమీకరణం 6 బంతుల్లో 16 పరుగులుగా మారింది. భారత్ జోడి ఊపును చూసి 16 పరుగుల్ని సాధించడం ఏమంత కష్టం కాదనిపించింది. దీంతో టీమిండియాదే విజయం అని అంతా భావించారు. అయితే, క్రీజులో ఉన్న దినేశ్ కార్తీక్ అతి విశ్వాసం మ్యాచ్నే చేజారేలా చేసింది. అదేలాగంటే ఆఖరి ఓవర్ వేసేందుకు సౌతీ బంతిని అందుకున్నాడు. తొలి బంతికి కార్తీక్ రెండు పరుగులు తీశాడు.
5 బంతుల్లో 14 పరుగులు
ఇక కావాల్సింది 5 బంతుల్లో 14 పరుగులు. రెండు బంతికి పరుగులేమీ తీయలేదు. బంతి బాగా ఆఫ్ స్టంప్కు వేయడంతో దినేశ్ కార్తీక్ హిట్ చేసేందుకు తటపటాయించాడు. అది వైడ్ అవుతుందనే ధీమాతో దినేశ్ కార్తీక్ ఆ బంతిని లైట్ తీసుకున్నాడు. కానీ అంపైర్ వైడ్ ఇవ్వలేదు. దీనిపై ఫీల్డ్ అంపైర్ను కార్తీక్ అడిగినా నిరాశే ఎదురైంది. 4 బంతుల్లో 14 పరుగులు కావాలి. మూడో బంతిని కార్తీక్ లాంగాన్ వైపు కొట్టినా సింగిల్ తీయలేదు.
3 బంతుల్లో 14 పరుగులు
కృనాల్ సింగిల్ కోసం అవతలి వైపు చేరుకున్నా.. అతి ఆలోచనతో కార్తీక్ పరుగు తీయలేదు. దాంతో భారత్కు మూడు బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి. కానీ, నాలుగో బంతి బౌన్సర్ కావడంతో దీనిని ఊహించని కార్తీక్ సింగిల్ తీశాడు. ఇక, ఐదో బంతిని కృనాల్ సింగిలే తీశాడు. ఇక ఆరో బంతి వైడ్ కావడంతో భారత్ ఖాతాలో పరుగు చేరగా, కివీస్ మరో బంతి వేయాల్సి వచ్చింది. అయితే ఆఖరి బంతిని కార్తీక్ సిక్స్ కొట్టడంతో భారత్ 208 పరుగులు చేసింది.
మూడో బంతికి సింగిల్ తీయకపోవడం వల్లే!
ఆఖరి ఓవర్లో మూడో బంతికి అలవోకగా సింగిల్ వచ్చే అవకాశమున్నా తీసుకోవడానికి దినేశ్ కార్తీక్ నిరాకరించి అందరికీ షాకిచ్చాడు. కృనాల్ సింగిల్ కోసం పరుగెత్తాడు. దాదాపు కార్తీక్ దాకా వెళ్లాడు. కానీ అతడు వద్దనడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు. మూడో బంతికి దినేశ్ కార్తీక్ సింగిల్ తీసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు
కృనాల్ సింగిల్కు ప్రయత్నించినప్పుడు కార్తీక్ తిరస్కరించడాన్ని భారత అభిమానులు తప్పుబడుతున్నారు. ఆ సింగిల్ తీసుంటే పరిస్థితి మరోలా ఉండేదని, అది భారత గెలుపుకు దారితీసేదని అభిప్రాయపడుతున్నారు. ‘కార్తీక్.. నువ్వు ధోని అనుకుంటున్నావా?' అని ఒకరు.. ‘ఎప్పుడూ స్వప్రయోజనం కోసమే కార్తీక్ ఆడుతాడు.. ఇదే ధోనికి కార్తీక్ ఉన్న తేడా' అని మరొకరు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో కార్తీక్ది ఏమాత్రం తప్పులేదని.. ఓ సీనియర్ బ్యాట్స్మన్గా జట్టును గెలిపించాలనే ఉద్దేశంతోనే అతను సింగిల్ తీయలేదని, కానీ సౌతి బౌలింగ్ అద్భుతంగా చేయడంతో అది కుదరలేదని మరికొందరు సమర్ధిస్తున్నారు.