ఆ విషయాల్ని నేను అడగలేను
తాజాగా భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రాతో జరిగిన ఇంటర్వ్యూలో సురేష్ రైనా పాల్గొన్నాడు. ధోనీతో పాటు అతని ఫ్యామిలీకి కూడా రైనా క్లోజ్ అవ్వడంతో.. మహీ రిటైర్మెంట్ ప్రణాళికల గురించి నీకు ఏమైనా తెలుసా? అని రైనాను చోప్రా ప్రశ్నించాడు.దీనిపై రైనా స్పందిస్తూ... 'రిటైర్మెంట్ ధోనీ వ్యక్తిగత నిర్ణయం. ఆ విషయాల్ని నేను అడగలేను. ధోనీ ఇప్పటికీ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. కొత్త తరహా షాట్స్ కూడా ఆడుతున్నాడు. అతని బుర్రలో ఏ ఆలోచన ఉందో ఎవరికి తెలుసు. మహీ సరైన నిర్ణయమే తీసుకుంటాడు' అని అన్నాడు.
చెన్నై జట్టులో కీలక ఆటగాడు:
టీమిండియా కెప్టెన్గా ఎంఎస్ ధోనీ ఉన్న రోజుల్లో సురేశ్ రైనాకి జట్టులో స్థానానికి ఢోకా ఉండేది కాదు. కానీ విరాట్ కోహ్లీ కెప్టెన్గా మారిన తర్వాత రైనా ఫామ్ కోల్పోయి క్రమంగా జట్టుకి దూరమయ్యాడు. ఇక ఇప్పుడు రీఎంట్రీ కోసం గత ఏడాదన్నర కాలంగా ఎదురుచూస్తున్నాడు. అయితే ఐపీఎల్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సుదీర్ఘకాలంగా ధోనీతో కలిసే రైనా మ్యాచ్లు ఆడుతున్నాడు. చెన్నై జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు.
ధోనీ మద్దతు ఇచ్చాడు
ఇటీవల అభిమానులు నిర్వహించిన ఓ షోలో రైనా మాట్లాడుతూ... నిజమే ధోనీ నాకు మద్దతుగా నిలిచాడు. దానికి కారణం మాత్రం నాలో టాలెంట్ ఉందని నమ్మడమే అని అన్నాడు. 'ధోనీ నాకు మద్దతు ఇచ్చాడని నేనే చెప్తాను. అతను నాకు మద్దతు ఇచ్చాడని నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ మద్దతుకు కారణం.. నాలో టాలెంట్ ఉందని మహీ విశ్వసించడమే. ధోనీ నాకు సపోర్ట్ చేసిన ప్రతిసారి నేను అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాను. అది భారత్ తరఫున కావొచ్చు, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కూడా కావొచ్చు' అని రైనా అన్నాడు.
భారత్ తరఫున చివరిసారిగా
ఇప్పటి వరకు భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2006లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన రైనా.. టీ20ల్లో 134.79 స్ట్రైక్రేట్తో 1,604 పరుగులు చేశాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం రీఎంట్రీ కోసం రైనా ఎదురుచూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఎలాగైనా ఆ టోర్నీలో ఆడాలనే సంకల్పంతో ఉన్నాడు.