వన్డేల్లో మరో రికార్డు బద్దలు..
ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి కివీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగిన రోహిత్ శర్మ.. చిక్కిన ప్రతి బంతిని బౌండరీ దాటించాడు. చిన్న బౌండరీలు కావడంతో ఎడా పెడా బౌండరీలు బాదేశాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న రికార్డును ఇటీవలే బద్దలు కొట్టిన రోహిత్.. కివీస్తో జరిగిన వన్డేలో మరో అడుగు ముందుకు వేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో సనత్ జయసూర్యను దాటేశాడు.
హిట్మ్యాన్ సిక్సర్ల మోత
తన సెంచరీ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు బాదిన రోహిత్.. 6 సిక్సర్లు కూడా కొట్టాడు. దీంతో అతను వన్డేల్లో కొట్టిన సిక్సర్ల సంఖ్య 272కు చేరింది. దీంతో వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి రోహిత్ చేరాడు. ఇంత కాలం ఈ రికార్డు సనత్ జయసూర్య పేరిట ఉండేది. అతను తన కెరీర్లో 270 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో పాక్ మాజీ లెజెండ్ షాహిద్ అఫ్రిడీ (351), క్రిస్ గేల్ (331) ముందున్నారు. రోహిత్ కనుక ఇదే ఫామ్ కొనసాగిస్తే సులభంగా వీళ్లిద్దర్నీ కూడా దాటేస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు.
టాప్-3 మనవాళ్లే..
ఇక ఈ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ చేసిన రోహిత్.. వన్డే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా ముందడుగు వేశాడు. ఇది రోహిత్కు 30వ వన్డే సెంచరీ. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ (30) రికార్డును రోహిత్ సమం చేశాడు. అయితే పాంటింగ్ కన్నా తక్కువ ఇన్నింగ్స్లలోనే రోహిత్ ఈ ఘనత సాధించడంతో అతను మూడో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో రోహిత్ కన్నా ముందు విరాట్ కోహ్లీ (46), సచిన్ టెండూల్కర్ (49) మాత్రమే ఉన్నారు.