
హైదరాబాద్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా విదేశాల్లో సైతం టెస్టు ఫార్మాట్లో ఎక్కువ మ్యాచ్ల్లో విజయం సాధిస్తుందని మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ వంటి పేసర్లతో టీమిండియా బౌలింగ్ ఎటాక్ పటిష్టంగా ఉందని తెలిపాడు.
పటిష్టమైన పేస్ బౌలింగ్ ఎటాక్ ఈ జట్టుకు వెన్నుముక అని లక్ష్మణ్ తెలిపాడు. దీంతో పాటు విదేశీ గడ్డపై బ్యాట్స్మెన్ల అనుభవం కూడా వారికి ఎంతో సహాయపడుతుందని అన్నాడు. గతేడాది 2-1 తేడాతో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ను టీమిండియా కైవసం చేసుకోవడంలో బుమ్రా, షమీ, ఇశాంత్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీలు కీలకంగా వ్యవహారించారు. తాజాగా ఇండియా టుడే ఇన్స్పిరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్ ప్రస్తుత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు.
"బౌలింగ్ యూనిట్లోనే కాదు, టీమిండియా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ లైనప్లో చాలా మంది అనుభవాన్ని కలిగి ఉన్నారు. క్లాస్ ఉంది. రాబోయే రోజుల్లో విదేశీ పర్యటనల్లో సత్తా చాటుతారు. న్యూజిలాండ్ నుంచే టీమిండియా గెలవడానికి నేను మద్దతు ఇస్తున్నాను" అని లక్ష్మణ్ వెల్లడించాడు.
ఐసీసీ టోర్నమెంట్లలో కోహ్లీసేన అవకాశాల గురించి కూడా లక్ష్మణ్ స్పందించాడు. "ప్రస్తుత జట్టులో ఒక సంస్కృతి ఏర్పడింది. ఛాంపియన్ లాగా ఆలోచించే సంస్కృతి. ఫలితాలు, ట్రోఫీలు వస్తాయి దాని గురించి ఎటువంటి సందేహం లేదు" అని వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశాడు.
వైట్ బాల్ క్రికెట్లో టీమిండియా చివరగా గెలుచుకున్న ఐసీసీ ట్రోఫీ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ. ఇంగ్లాండ్లో జరిగిన ఈ టోర్నీలో మాజీ కెప్టెన్ ధోని నాయకత్వంలోని టీమిండియా ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్స్లో టీమిండియా పాక్ చేతిలో ఓడిపోయింది.
కాగా, గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్లో సైతం టీమిండియా సెమీస్లోనే ఇంటిదారి పట్టింది. ఇటీవలి ఐసీసీ టోర్నమెంట్లలో జట్టు వైఫల్యాలు ఉన్నప్పటికీ, జట్టులో అభివృద్ధి చెందిన సంస్కృతి కారణంగా రాబోయే టోర్నమెంట్లలో టీమిండియా మరిన్ని ట్రోఫీలను కైవసం చేసుకుంటుందని లక్ష్మణ్ తెలిపాడు.