IPL 2021: ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి.. జట్టును నడిపించడం కష్టం: గంభీర్

ఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రావాలని టీమిండియా మాజీ ఓపెనర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ సూచించాడు. ఏడో స్థానం కన్నా దిగువన వచ్చి జట్టును నడిపించడం కష్టమన్నాడు. ఒకప్పటిలా మహీ మైదానం నలుమూలలా షాట్లు కొట్టలేకపోతున్నాడని గౌతీ పేర్కొన్నాడు. ఈ సీజన్లో తొలి మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్తో చెన్నై తలపడింది. ఆ మ్యాచ్లో ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. రెండు బంతులు ఆడిన మహీ.. అవేశ్ ఖాన్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. దాంతో అతడి ఆటకు ఎన్నో రోజులు వేచిచూసిన ధోనీ అభిమానులు నిరాశ చెందారు.

మ్యాచ్ ప్రాక్టీస్ దొరకడం లేదు:
ఇంగ్లండ్ గడ్డపై జరిగిన 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. సంవత్సరం తర్వాత గతేడాది ఆగస్టులో అన్ని ఫార్మాట్లకు మహీ వీడ్కోలు పలికాడు. అప్పటినుంచి అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ దొరకడం లేదు. యూఏఈలో గతేడాది జరిగిన ఐపీఎల్లోనూ మహీ మోస్తరు ప్రదర్శనే చేశాడు. కీలక సమయంలో ఒత్తిడి తట్టుకోలేక పెవిలియన్ చేరాడు. జట్టు కోసం మునుపటిలా మ్యాచ్లను ముగించలేకపోయాడు. కెప్టెన్సీలో కూడా గతంలోని మార్క్ కనబడలేదు. మొత్తానికి ఐపీఎల్ 2020లో చెన్నై 7వ స్థానంతో ముగించింది.

బ్యాటింగ్ ఆర్డర్లో ముందు రావాలి:
'నాయకుడు జట్టును ముందుండి నడిపించాలని మేం ఎప్పుడూ చెబుతున్నాం. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి, జట్టును నడిపించడం కష్టం. ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా రావాలి. అప్పుడే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చెన్నై బౌలింగ్ విభాగంలో సమస్యలు ఉండటం నిజమే. ఇక మహీ ఇంతకుముందులా ఆడటం లేదు. క్రీజులోకి రావడంతోనే బౌలర్లపై ఎదురుదాడి చేయలేకపోతున్నాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడలేకపోతున్నాడు. నా ఉద్దేశం ప్రకారం మహీ నాలుగు లేదా ఐదో స్థానంలో రావాలి' అని గౌతమ్ గంభీర్ సూచించాడు.

12 లక్షల రూపాయల జరిమానా:
ఢిల్లీ కాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో స్లోయర్ రన్రేట్ కారణంగా ఎంఎస్ ధోనీపై ఇప్పటికే 12 లక్షల రూపాయల జరిమానా పడింది. స్లోయర్ రన్ రేట్ కారణంగా ఈ మొత్తాన్ని అతను చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. వాంఖెడే మైదానంలో పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో ధోనీ గనక మరోసారి స్లో రన్రేట్ను నమోదు చేస్తే ఇక చిక్కుల్లో పడినట్టే. మూడోసారి అదే రిపీట్ అయితే మహీపై ఓ మ్యాచ్ నిషేధం పడుతుంది. బీసీసీఐ రూపొందించిన కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం.. ఏ జట్టయినా 90 నిమిషాల వ్యవధిలో 20 ఓవర్ల ఓటాను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ రోజు హైఓల్టేజ్ మ్యాచ్:
ఈ సీజన్ తొలి మ్యాచ్లో చెన్నై జట్టు ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. 188 పరుగుల భారీ స్కోర్ను కాపాడుకోలేకపోయింది. ఈ రోజు సాయంత్రం చెన్నై, పంజాబ్ కింగ్స్ మధ్య మరో హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. 7:30 గంటలకు ముంబై వాంఖెడే స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 221 పరుగుల రికార్డ్ స్కోర్ పంజాబ్ చేసింది. ఈ సీజన్లో ఈ రెండు జట్లూ తలపడటం ఇదే తొలిసారి. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో సూపర్ కింగ్స్.. తమ జోరును కొనసాగించాలనే కసితో కేఎల్ రాహుల్ టీమ్ ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications