హైదరాబాద్: అద్భుతంగా రాణించి ఐపీఎల్ 2018లో చాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్కింగ్స్కు ముంబై వాంఖడే మైదానం బాగా కలిసొచ్చింది. స్పాట్ ఫిక్సింగ్ నిషేధంతో రెండేళ్ల నిషేదం తర్వాత తిరిగి పునరాగమనం చేసిన చెన్నైకు సత్ఫలితమే దక్కింది. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం ద్వారా పలువురు విమర్శకులకు సమాధానం దొరికింది. ఓ రకంగా చూస్తే.. ధోనీ కెప్టెన్సీలో బరిలోకి దిగిన చెన్నై..వాంఖడే వేదికగా చెలరేగి ఆడింది.
ఈ సీజన్లో జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ విజేతగా నిలిచింది. డ్వేన్ బ్రావో, కేదార్ జాదవ్ అద్భుత పోరాటపటిమతో తమ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్పై చెన్నై ఉత్కంఠ విజయం సొంతం చేసుకుంది. లీగ్ దశను రెండో స్థానంతో ముగించిన ధోనీసేన క్వాలిఫయర్-1తో పాటు ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్పై అద్భుత విజయాలు సొంతం చేసుకుంది.
ముంబై స్టేడియంలో మూడు మ్యాచ్లు గెలిచిన చెన్నై.. హైదరాబాద్తో జరిగిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి చూపించింది. డుప్లెసిస్ ఒంటిపోరాటంతో క్వాలిఫయర్-1లో గెలిచిన ధోనీసేన..ఫైనల్లో అదే హైదరాబాద్పై వాట్సన్ సూపర్ సెంచరీతో ఐపీఎల్ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది.
ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ట్రోఫీను సొంతం చేసుకుంది. అనంతరం ఆనందోత్సాహాలతో సొంత గడ్డ చెన్నైపై సూపర్ కింగ్స్ అడుగుపెట్టారు. ఎయిర్పోర్టులోనే ధోనీ సేనకు చెన్నై వాసులు బ్రహ్మరథం పట్టి ఘన స్వాగతం పలికారు.