ముంబై: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతోన్న భారత క్రికెట్ జట్టు.. అస్సాం చేరుకుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో టీమిండియా 1-0 తేడాతో ముందంజలో ఉంది. తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఎనిమిది వికెట్ల తేడాతో మట్టి కరిపించిన తరువాత అస్సాం షిఫ్ట్ అయింది. గువాహటి స్టేడియంలో రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం షెడ్యూల్ అయిందీ మ్యాచ్.
ఇంకొద్ది రోజుల్లో టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ముందు టీమిండియా జైత్రయాత్ర సాగిస్తోండటం శుభపరిణామమే అయినప్పటికీ- అనుకోని అవాంతరం వచ్చి పడింది. బౌలింగ్ బ్యాక్బోన్ జస్ప్రీత్ బుమ్రా బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు. ఈ సిరీస్తో పాటు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్కూ దూరం అయ్యాడు. ఇది ఏ మాత్రం ఊహించని పరిణామమే. గాయం వల్ల స్టార్ పేసర్ దూరం కావడం- జయాపజయాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.
అతని స్థానంలో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్కు అవకాశం దక్కుతుందనే సమాచారం ఉంది. మరో పేస్ బౌలర్ మహ్మద్ షమీ పేరును కూడా బీసీసీఐ సెలెక్టర్లు పరిశీలిస్తోన్నారు. బుమ్రా వెన్నెముక ఫ్రాక్చర్ బారిన పడినట్టు సమాచారం అందిన కొద్దిసేపటికే- షమీ కోవిడ్ నుంచి కోలుకున్నాడు. సీనియర్ కావడం వల్ల సెలెక్టర్లు షమీ వైపే మొగ్గు చూపొచ్చు. అదే జరిగితే- సిరాజ్కు టీ20 ప్రపంచకప్ ఆడే ఛాన్స్ దక్కనట్టే.
ఇదిలావుంటే- జస్ప్రీత్ బుమ్రా మరో సిరీస్కు కూడా దూరమౌతాడనే ప్రచారం ఊపందుకుంటోంది. స్వదేశంలో జరిగే ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్కు కూడా అతను అందుబాటులో ఉండటం అనుమానమే. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా ఐసీసీ షెడ్యూల్ చేసిన సిరీస్ ఇది. ఇందులోనూ బుమ్రా ఆడే అవకాశాలు చాలా తక్కువేనని తెలుస్తోంది. వెన్నెముక ఫ్రాక్చర్కు సర్జరీ చేయించుకోవాలనే ఉద్దేశంతో బుమ్రా ఉన్నాడు. సర్జరీ చేయించుకుంటే మాత్రం బెడ్ రెస్ట్ అవసరమౌతుంది.