వెటరన్ ప్లేయర్లు ఎలా ఆడారు?
ఈసారి ప్రపంచకప్లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. టాపార్డర్ వరుసగా విఫలం అవుతున్నా.. సూర్యకుమార్ యాదవ్తో కలిసి జట్టుకు మంచి స్కోర్లు అందించాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ గురించి ఇదే మాట చెప్పలేం. ఈ మెగా టోర్నీలో దారుణంగా విఫలమైన రోహిత్.. బంతిని సరిగా టైమింగ్ చేయడానికి కూడా కష్టపడ్డాడు.
భవితవ్యం ఏంటి?
సెమీఫైనల్ మ్యాచ్లో బ్యాటింగ్కు సహకరిస్తున్న పిచ్పై రోహిత్ శర్మ (28 బంతుల్లో 27) చెత్త బ్యాటింగ్ చేశాడు. అదే సమయంలో అవతలి ఎండ్లో విరాట్ కోహ్లీ కూడా భారీ షాట్లు ఆడలేదు. టాపార్డర్ నెమ్మదైన ఆటతీరును అన్ని మ్యాచుల్లో కవర్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ (14) అవుటవడంతో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. చివర్లో పాండ్యా (33 బంతుల్లో 63) రాణించకపోతే కనీసం స్కోరు కూడా చేసేది కాదు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్, కోహ్లీలను పొట్టి ఫార్మాట్లో కొనసాగించాలా? లేదంటే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలా? అని చర్చ జరుగుతోంది.
రాహుల్ ద్రావిడ్ ఏమన్నాడు?
నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించి, చివరి ఓవర్లలో భారీ షాట్లు ఆడే వెటరన్ ప్లేయర్ల టెంప్లేట్ జట్టుకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని కొందరు అంటున్నారు. దీంతో భవిష్యత్తులో వారిని ఏం చేస్తారని టీమిండియా హెడ్ కోచ్ ద్రావిడ్ను ప్రశ్నించగా.. 'వాళ్లపై నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. వీళ్లు అద్భుతమైన ఆటగాళ్లు. ఇప్పుడు మా దగ్గర ఇంకా టైం ఉంది. వచ్చే ప్రపంచకప్ సమయానికి ఆలోచిస్తాం' అని చెప్పాడు.