
పాకిస్తాన్ వేదికగా జరిగే ఆసియా కప్లో తాము ఆడటం కుదరదని బీసీసీఐ చెప్తున్న సంగతి తెలిసిందే. తమ ఆటగాళ్లు పాకిస్తాన్ వెళ్లడం అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న నిర్ణయమని, వాళ్లు వద్దంటే కుదరదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆసియా కప్ను తటస్థ వేదికపై జరపాలని కోరింది. అయితే ఇలా బీసీసీఐ కోరడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మండిపడిన సంగతి తెలిసిందే. పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రజా అయితే బెదిరింపులకు కూడా దిగాడు. ఇలాగైతే తాము కూడా భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడబోమని చెప్పాడు.
దీనిపై చర్చించేందుకు మరోసారి ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశం కానుందని సమాచారం. ఆసియా హోస్టింగ్ హక్కుల గురించి చర్చించేందుకే ఈ సమావేశం జరగనుందని తెలుస్తోంది. ఆసియా కప్ షెడ్యూల్ను ఏసీసీ సెక్రటరీ జై షా విడుదల చేయడంపై పీసీబీ నయా చీఫ్ నజామ్ సేథీ కూడా కొన్ని రోజుల క్రితం అక్కసు వెళ్లగక్కాడు. కనీసం తమను సంప్రదించకుండా ఈ టోర్నీ షెడ్యూల్ ప్రకటించడం కరెక్ట్ కాదన్న అతను.. ఇలాగైతే పాకిస్తాన్ సూపర్ లీగ్ షెడ్యూల్ కూడా మీరే ప్రకటించండి అంటూ ఎద్దేవా చేశాడు.
అయితే తాము అన్ని సభ్య దేశాలకు ఈ షెడ్యూల్ పంపించామని, కానీ దీనిపై పాకిస్తాన్ నుంచి తమకు ఎలాంటి రిప్లై రాలేదని ఏసీసీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో తాను ఏసీసీ సెక్రటరీ జే షాను కలుస్తానని సేథీ అన్నాడు. కానీ అది కుదరలేదు. ఈ క్రమంలో ఏసీసీ అధికారులను కలిసి తన డిమాండ్ వెల్లడించాడు. పాకిస్తాన్ సూచన మేరకే వచ్చే శనివారం నాడు ఏసీసీ సభ్యులు సమావేశం కానున్నారు. బహ్రెయిన్ వేదికగా జరిగే ఈ మీటింగ్లో ఆసియా కప్ వేదిక మార్చడంపైనే చర్చిస్తారని తెలుస్తోంది. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.