భవిష్యత్తు సారథి అతనే..
ఈ సందర్భంగా కర్ణాటక బ్యాట్స్మన్పై ప్రశంసల జల్లు కురిపించాడు. మూడు ఫార్మాట్లలో రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడాడు. కోహ్లీ, రోహిత్ తర్వాత భారత జట్టుకు ఎవరు సారథ్యం వహిస్తాడని ఓ అభిమాని శ్రీశాంత్ను ప్రశ్నించగా.. ఈ కేరళ పేసర్ రాహుల్ పేరు చెప్పాడు. ‘కేఎల్ రాహులే భారత భవిష్యత్తు సారథి. ఎందుకంటే అతను మూడు ఫార్మాట్లలో అద్బుతంగా రాణిస్తున్నాడు. ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా బాధ్యాతాయుతంగా ఆడుతున్నాడు. విరాట్లో ఉన్న సత్తానే రాహుల్లో ఉంది.'అని శ్రీశాంత్ సమాధానమిచ్చాడు.
కెప్టెన్సీ చేయని రాహుల్..
ఇక తన కెరీర్లో రాహుల్ ఇప్పటి వరకు ఏ జట్టుకు సారథ్య బాధ్యతలు వహించలేదు. కానీ ఈ సీజన్ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సారథిగా ఎంపికయ్యాడు. కానీ కరోనా కారణంగా ఈ క్యాష్ రిచ్ లీగ్ నిరవధికంగా వాయిదా పడింది. కాకపోతే న్యూజిలాండ్ గడ్డపై వైస్ కెప్టెన్సీ హోదాలో జట్టును నడిపించాడు. నాలుగో టీ20లో తాత్కలిక కెప్టెన్ రోహిత్ గాయంతో బెంచ్కే పరిమితమవ్వగా.. రాహుల్ సారథ్యం వహించాడు. సూపర్ ఓవర్కు దారితీసిన ఆ మ్యాచ్లో భారత్ గెలుపొందింది. అప్పుడే రాహుల్ కెప్టెన్సీ సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది. ఆ మ్యాచ్లో రిజర్వ్ బెంచ్ను పరీక్షించేందుకు కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు.
వన్డేల్లో 300 చేసే సత్తా..
లైవ్ సెషన్లో శ్రీశాంత్ మరిన్నీ ఆసక్తికర విషయాలు కూడా పంచుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 300 పరుగులు చేసే సత్తా రోహిత్, రాహుల్, బెన్ స్టోక్స్లకే ఉందన్నాడు. తాను మంచి డ్యాన్సర్ అని చెప్పిన శ్రీశాంత్... టీమిండియాలో విరాట్, భజ్జీ కూడా మంచి డ్యాన్సర్లేనని తెలిపాడు. సచిన్తో కోహ్లీని పోల్చలేమని, కింగ్ ఆఫ్ క్రికెట్ కోహ్లీ అయితే.. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ అని ఈ వెటరన్ పేసర్ చెప్పుకొచ్చాడు.
దాదా సాయం మరవలేనిది..
ప్రస్తుతం యువ ఆటగాళ్లకు టీ20, ఐపీఎల్తో ఎన్నో అవకాశాలు దక్కుతున్నాయని, గతంలో అలా లేదని శ్రీశాంత్ పేర్కొన్నాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే సమయంలో గంగూలీ తనకెంతో సాయం చేశాడని, దాదా ఇచ్చిన సలహాలతో టెస్టు మ్యాచ్ ల్లో ఎన్నో ప్రయోగాలు చేసినట్లు శ్రీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాహుల్ కారణంగా టీమిండియాలో నాలుగో స్థానం భర్తీ అయ్యిందని, టెస్ట్ల్లో భారత జట్టుకు తిరుగులేదన్నాడు. దేశానికి మరోసారి ప్రాతినిథ్యం వహించడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని ఈ కేరళ స్టార్ చెప్పుకొచ్చాడు.