అండర్ 19 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్లోకి తారాజువ్వలా దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు. టీమిండియా భవిష్యత్తు సారథి అవుతాడని ప్రశంసలు అందుకున్న ఈ ముంబై కుర్రాడు.. ప్రస్తుతం ఐపీఎల్లోనూ నిలదొక్కుకోలేకపోతున్నాడు. 'సచిన్+ సెహ్వాగ్= పృథ్వీ షా'అని కామెంటేటర్ల ప్రశంసలు అందుకున్న ఈ ముంబై కుర్రాడు.. మరో కోహ్లీ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ అతని విధి రాతనో లేక దురదృష్టమో కానీ కెరీర్ను నిలబెట్టుకోలేకపోయాడు.
గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో పాటు చెడు స్నేహాలు పృథ్వీ షా కెరీర్ను నాశనం చేశాయి. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో అతను అన్సోల్డ్గా నిలిచాడు. అయితే ఐపీఎల్లో పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి కాకుండా ముంబై ఇండియన్స్కు ఆడి ఉంటే స్టార్ క్రికెటర్గా ఎదిగేవాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగడం అతను చేసుకున్న దురదృష్టమని కామెంట్ చేస్తున్నారు.

పృథ్వీ షాకు ఢిల్లీ క్యాపిటల్స్ అండగా నిలిచినా.. అతనికి మంచి గైడెన్స్ ఇవ్వలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు. రూ.20 లక్షల కనీస ధరతో 2018 వేలంలోకి వచ్చిన పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఢిల్లీతో పాటు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడటంతో అతని ధర అమాంతం పెరిగిపోయింది. ఆ వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసి ఉంటే పృథ్వీ షా.. ప్రస్తుతం టీమిండియాకు కెప్టెన్గా ఉండేవాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముంబై ఇండియన్స్ జట్టులో పృథ్వీ షాకు మరింత నాణ్యమైన శిక్షణతో పాటు మంచి గుర్తింపు లభించేదని పేర్కొంటున్నారు. సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ గైడెన్స్లో పృథ్వీ షా మరింత రాటు దేలేవాడని, వ్యక్తిగతంగా కూడా అతనికి మంచి మద్దతు లభించేదని అంటున్నారు. గాయాల విషయంలోనూ ముంబై ఇండియన్స్ మెరుగైన చికిత్స అందించేదని, ఫిట్నెస్ కూడా బాగుండేదని కామెంట్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన చాలా మంది కుర్రాళ్లు భారత స్టార్లుగా ఎదిగారని గుర్తు చేస్తున్నారు. పాండ్యా బ్రదర్స్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లంతా ముంబై నుంచి వచ్చినవారే.
ప్రస్తుతం టీమిండియా వన్డే కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్, ప్రధాన పేసర్ అర్ష్దీప్ సింగ్, విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మలు పృథ్వీ షా సారథ్యంలోనే ఆడినవారే. సరైన గైడెన్స్తో ఈ ముగ్గురు ఆటగాళ్లు టీమిండియా స్టార్లుగా ఎదిగారు. ఢిల్లీ క్యాపిటల్స్కు బదులు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి ఆడినా పృథ్వీ షా జీవితం మరోలా ఉండేదని కామెంట్ చేస్తున్నారు.

దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు నుంచి తప్పుకున్న పృథ్వీ షా మహారాష్ట్ర తరఫున తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో రాణించడంతో పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.75 లక్షల అతని కనీస ధరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో సత్తా చాటి తన కెరీర్ను రీస్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో పృథ్వీ షా ఉన్నాడు. ఇటీవలే తన ప్రియురాలైన ఆకృతి అగర్వాల్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత అతనికి పెళ్లి జరిగే అవకాశం ఉంది.
పృథ్వీ షా 26 ఏళ్ల వయసే కాబట్టి అతను కష్టపడితే తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పెళ్లి అయిన తర్వాత అయినా పృథ్వీ షా చెడు స్నేహాలు మానేసి ఆటపై దృష్టి సారించాలని అభిమానులు కోరుకుంటున్నారు.