రూ.4వేల కోట్ల నష్టం..
ఐపీఎల్ 2020 సీజన్ ఈ ఏడాది జరగకపోతే బీసీసీఐకి సుమారు 4వేల కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లుతుందని ఇప్పటికే బోర్డు వర్గాలుస్పష్టం చేశాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ క్యాష్ రిచ్ లీగ్.. కరోనా కారణంగా తొలుత ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. అనంతరం దేశంలో లాక్డౌన్ పొడిగించడంతో నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పటికైతే ఈ మెగాటోర్నీపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
రద్దయితే కోత తప్పదు..
అయితే ఈ ఏడాది ఐపీఎల్ రద్దయితే భారత క్రికెటర్ల జీతాల్లోనూ కోత పడనుందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ హింట్ ఇచ్చాడు. ఓ జాతీయ చానెల్తో మాట్లాడుతూ.. బీసీసీఐ ఆర్థిక పరిస్థితి సమక్షిస్తున్నామని, ఐపీఎల్ జరగకుంటే ఆటగాళ్ల జీతాల్లో కోత తప్పదని సూచన ప్రాయంగా తెలిపాడు. ‘బీసీసీఐ ప్రస్తుత ఆర్థి క పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్ జరగకపోతే మాత్రం బీసీసీఐకి సుమారు రూ. 4వేల కోట్లు నష్టం వాటిల్లనుంది. ఇది చాలా పెద్ద మొత్తం కాబట్టి పూర్తి స్థాయిలో సమీక్షించి ఆటగాళ్ల జీతాల్లో కోతపై నిర్ణయం తీసుకుంటాం. అయితే ఐపీఎల్ జరిగితే మాత్రం క్రికెటర్ల జీతాల్లో ఎలాంటి కోతలుండవు'అని దాదా స్పష్టం చేశాడు.
ఎవరికెంత జీతాలంటే..?
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం ఆటగాళ్లకి జీతాల్ని చెల్లిస్తోంది. ఈ కాంట్రాక్ట్లను ఎ+, ఎ, బి, సి నాలుగు గ్రేడ్లుగా విభజించిన బీసీసీఐ.. ఎ+ గ్రేడ్లోని ఆటగాళ్లకి ఏడాదికి రూ.7 కోట్లు, ఎ కేటగిరీ క్రికెటర్లకి రూ. 5 కోట్లు, బి గ్రేడ్లో ఉన్న వారికి రూ. 3 కోట్లు, సి కేటగిరీ ఆటగాళ్లకి రూ. 1 కోటిని వార్షిక వేతనంగా అందిస్తుంది. మూడు ఫార్మాట్లలో రెగ్యులర్గా ఆడే ఆటగాళ్లకి మాత్రమే ఎ+ గ్రేడ్ ఇస్తుండగా.. ఈ ఏడాది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమే ఆ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఏదో ఒక ఫార్మాట్లో స్థిరంగా ఉన్న ఆటగాళ్లకు గ్రేడ్-ఎ కేటాయించగా.. జట్టులోకి వస్తూ.. పోతూ ఆడుతున్న ఆటగాళ్లను బి గ్రేడ్ ఇచ్చారు. కొత్త ఆటగాళ్లు, స్థిరంగా జట్టులో ఉండని ప్లేయర్లకు సీ గ్రేడ్ కేటాయించారు. ఇక సుమారు 10 నెలలుగా ఎలాంటి క్రికెట్ ఆడని భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. మహిళా క్రికెట్లో గ్రేడ్-ఎ ప్లేయర్లకు రూ.50 లక్షలు, గ్రేడ్ బిలో ఉన్నవారికి రూ. 30 లక్షలు, గ్రేడ్ సీ ఆటగాళ్లకు రూ.10 లక్షలు అందజేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం కోసం..
కరోనా కట్టడికి దశలవారిగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం.. మే 18 నుంచి నాలుగో దశ లాక్డౌన్ను తీసుకురానుంది. అయితే ఈ సారి కొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా భవిష్యత్తు ప్రణాళిక రచించాలని బీసీసీఐ భావిస్తోంది. కొన్ని సడలింపులిస్తే.. వచ్చే రెండు నెలల్లో ప్రేక్షకుల్లేకుండా ఖాళీ మైదానాల్లో ఐపీఎల్ నిర్వహించాలని సమాలోచనలు చేస్తోంది.
కరోనా తెచ్చిన కష్టం.. ఫుడ్ డెలివరీ బాయ్గా మారిన ఒలింపిక్ విజేత