మా గాశారం బాలేదు: రిషభ్ పంత్
తమ జట్టు గాశారం ఏ మాత్రం బాలేదని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. కాస్త అదృష్టం కలిసి వస్తే విజయాలు సాధిస్తామని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ పరాజయంతో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. 9 మ్యాచ్ల్లో 7 ఓటములతో ముంబై ఇండియన్స్తో కలిసి ఇంటిబాట పట్టింది. టోర్నీలో మిగిలిన 5 మ్యాచ్లకు 5 గెలిచినా లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ చేరలేని పరిస్థితి నెలకొంది.
బౌలర్లను నిందించలేం
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రిషభ్ పంత్.. లోయరార్డర్ బ్యాటింగ్ వైఫల్యం తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. తమ లక్ష్యానికి అదనంగా 10-15 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ఈ వికెట్పై 229 పరుగుల లక్ష్యం సరిపోదని, ఈ ఓటమికి బౌలర్లను నిందించలేమని చెప్పాడు. ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కొనియాడాడు.

'మా లక్ష్యానికి కొన్ని పరుగులు తక్కువ చేశాం. మాకు లభించిన ఆరంభానికి మేం భారీ స్కోర్ చేయాల్సింది. మా బ్యాటర్లు చాలా స్వేచ్ఛగా ఆడారు. కానీ ముంబై బౌలర్లు అద్భుతంగా పుంజుకొని మమ్మల్ని కట్టడి చేశారు. వారికి ఈ వికెట్ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. మేం 10-15 పరుగులు తక్కువ చేశాం. ఇది 230-240 పరుగులు చేయాల్సిన వికెట్.
కాస్త లక్ కావాలి బాస్..
ఇన్నింగ్స్ ఆరంభంలో ముంబైపై మేం పైచేయి సాధించాం. కానీ ఇలాంటి వికెట్పై ప్రతిసారీ బౌలర్లను నిందించలేం. మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. కాబట్టి ఈ ఓటమికి వారిని నేను బాధ్యులను చేయను. మా జట్టుకు కొంచెం అదృష్టం కావాలి బాస్. నేను చెప్పగలిగేది అదే. అదృష్టం ఎలా వస్తుంది? అంటే.. చాలా మంది దీవెనలు ఉంటే లక్ మావైపు ఉంటుందని భావిస్తున్నా. అలాగే మా వైపు నుంచి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంది. ఇది మాత్రం ఖాయం'అని పంత్ చెప్పుకొచ్చాడు.
పూరన్ రాణించినా..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(21 బంతుల్లో ఫోర్, 8 సిక్స్లతో 63) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. మిచెల్ మార్ష్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 44), ఎయిడెన్ మార్క్రమ్(25 బంతుల్లో ఫోర్, సిక్స్తో 31 నాటౌట్), హిమ్మత్ సింగ్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 40 నాటౌట్) విలువైన పరుగులు జోడించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో కార్బిన్ బోష్(2/20) రెండు వికెట్లు తీయగా.. అల్లా ఘజన్ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో వికెట్ తీసారు.
అనంతరం ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్లతో 83), రోహిత్ శర్మ(44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్లతో 84) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. నమన్ ధీర్(12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్2తో 23 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. లక్నో బౌలర్లలో మణిమరన్ సిద్దార్థ్(2/47) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, మోహ్సిన్ నఖ్వీ చెరో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications