ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో బుమ్రా నోబాల్స్ వేయడంపై లిటిల్ మాస్టర్ మండిపడ్డాడు. బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ నోబాల్స్ వేయడం ఏ మాత్రం అమోదయోగ్యం కాదని అసహనం వ్యక్తం చేశాడు.
ఈ సీజన్లో బుమ్రా పేలవ ప్రదర్శనతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ధారళంగా పరుగులిచ్చుకోవడంతో పాటు వికెట్లు తీయలేకపోతున్నాడు. అతని వైఫల్యం ముంబై ఇండియన్స్ విజయవకాశాలపై ప్రభావం చూపుతుంది. ఎన్నడూ లేని విధంగా బుమ్రా నోబాల్స్ వేస్తున్నాడు. ఈ సీజన్లో బుమ్రా ఇప్పటికే 8 నోబాల్స్ వేసాడు. లక్నోతో నిన్నటి మ్యాచ్లో బుమ్రా ఏకంగా మూడు నోబాల్స్ వేసాడు. ఇవి ముంబై ఇండియన్స్కు తీవ్ర నష్టం చేశాయి.
లక్నో ఇన్నింగ్స్ 14వ ఓవర్లో బుమ్రా వేసిన ఒక నో-బాల్ హిమ్మత్ సింగ్కు లైఫ్ లభించింది. క్యాచ్ ఔట్ అయినప్పటికీ.. నో-బాల్ కారణంగా హిమ్మత్ సింగ్ బతికిపోయి 40 పరుగులు చేశాడు. దాంతో లక్నో 229 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరించిన గవాస్కర్.. బుమ్రా నోబాల్స్ వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

టీ20 క్రికెట్లో నో-బాల్స్ వేయడం అనేది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇంకాస్త ప్రొఫెషనలిజం చూపాలన్నాడు. 'మరోసారి నాకు చెప్పకండి. బుమ్రా నో-బాల్ వేశాడని నాకు అస్సలు చెప్పకండి. అది ఒప్పుకోదగినది కాదు. మీరు ఒక ప్రొఫెషనల్ క్రికెటర్. మీ నుంచి నోబాల్స్ ఏ మాత్రం అంగీకరించం. వైడ్స్ అయితే, నాకు అర్థమవుతుంది. కానీ నో-బాల్స్ మాత్రం కాదు.’ అని గావస్కర్ తన కామెంట్రీలో అసహనం వ్యక్తం చేశాడు.
బుమ్రా వరుసగా నో-బాల్స్ వేయడం చూసి ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే, బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ సైతం ఆశ్చర్యపోయారు. ఈ మ్యాచ్లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 4 ఓవర్లలో 45 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన బుమ్రా కేవలం 3 వికెట్లు మాత్రమే తీసాడు. గతంలో తన బౌలింగ్తో ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన బుమ్రా.. తాజా సీజన్లో తేలిపోతున్నాడు.
ఈ మ్యాచ్లో బుమ్రా విఫలమైనా.. ర్యాన్ రికెల్టన్(32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్లతో 83), రోహిత్ శర్మ(44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్లతో 84) అద్భుతమైన బ్యాటింగ్తో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(21 బంతుల్లో ఫోర్, 8 సిక్స్లతో 63) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. మిచెల్ మార్ష్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 44), ఎయిడెన్ మార్క్రమ్(25 బంతుల్లో ఫోర్, సిక్స్తో 31 నాటౌట్), హిమ్మత్ సింగ్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 40 నాటౌట్) విలువైన పరుగులు జోడించారు.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో కార్బిన్ బోష్(2/20) రెండు వికెట్లు తీయగా.. అల్లా ఘజన్ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో వికెట్ తీసారు. అనంతరం ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసి గెలుపొందింది.