సన్రైజర్సే ఛేజ్ చేసినప్పుడు.. మేం చేయలేమా అనిపించింది: సూర్యకుమార్ యాదవ్
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నోసూపర్ జెయింట్స్పై సాధించిన విజయంపై ముంబై ఇండియన్స్ తాత్కలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకోవడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని తెలిపాడు. సోమవారం వాంఖడే వేదికగా జరిగిన ఈ హైస్కోరింగ్ గేమ్లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని చూసి తాము భయపడలేదని స్పష్టం చేశాడు. ఇదే వేదికపై సన్రైజర్స్ హైదరాబాద్ 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించినప్పుడు తాము 229 పరుగులను ఛేదించలేమా?అని అనిపించిందని చెప్పాడు. సమష్టి ప్రదర్శనతో ఈ విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు.
మా బౌలర్లు అద్భుతం..
'లక్నో సూపర్ జెయింట్స్కు అదిరిపోయే ఆరంభం దక్కిన తర్వాత మా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఈ సీజన్లో ఇలాంటి పరిస్థితులను మేం చాలా సార్లు ఎదుర్కొన్నాం. కాబట్టి ఇది మాకు కొత్తేమీ కాదు.
పవర్ప్లే ముగిసిన తర్వాత 7 నుంచి 10 ఓవర్ల మధ్య కట్టడిగా బౌలింగ్ చేస్తే మ్యాచ్ను మనవైపు తిప్పుకోవచ్చనే విషయం నాకు తెలుసు. ఈ ఓవర్లలో రెండు వికెట్లు తీస్తే మ్యాచ్పై పట్టు సాధించవచ్చని భావించా. అందుకు తగ్గట్లుగా మా బౌలర్లు కూడా అద్భుతంగా స్పందించారు.

నేనేం చెప్పలేదు..
సుమారు 8-9 ఓవర్ల సమయానికి లక్నో 1 లేదా 2 వికెట్ల నష్టానికి 110 లేదా 120 పరుగులతో ఉన్నారని గుర్తు. కానీ అక్కడి నుంచి 16 ఓవర్లకు వారిని 5 వికెట్ల నష్టానికి 162 పరుగుల వద్ద కట్టడి చేయడం నమ్మశక్యం కాని ప్రదర్శన. జట్టులో ప్రతి ఒక్కరికీ ఆ నమ్మకం ఉంది. వారి ప్రణాళికలు స్పష్టంగా ఉన్నాయి. నేను వారికి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. కొన్ని సందర్భాల్లో వారికి చిన్నపాటి మద్దతును మాత్రమే ఇచ్చాను. అంతిమంగా వారు ప్రదర్శించిన తీరు, బౌలింగ్ చేసిన విధానం అమోఘం.
సన్రైజర్సే ఛేజ్ చేసింది..
కొద్ది రోజుల క్రితమే మేం 244 పరుగులు చేసాం. ఆ లక్ష్యాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ అలవోకగా ఛేజ్ చేసింది. కాబట్టి 220-225-230 పరుగులు ఏవైనా ఛేజ్ చేయవచ్చని మేం భావించాం. అందుకు తగ్గట్లుగానే మా ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ర్యాన్ రికెల్టన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
రోహిత్ దుమ్మురేపాడు..
టాస్ సమయంలోనే చెప్పిన్నట్లు రోహిత్ శర్మ జట్టులోకి తిరిగి వచ్చి దుమ్మురేపాడు. అతను చాలా ఫిట్గా, ఉత్సాహంగా ఉన్నాడు. అతను బ్యాటింగ్ చేసిన తీరు.. ప్రేక్షకులకు అందించిన వినోదం అద్భుతం. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు అద్భుతమైన ఆరంభం అవసరం.
ఆ ఆరంభాన్ని రోహిత్, ర్యాన్ రికెల్టన్ అందించారు. వారిద్దరూ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. చివర్లో నమన్ ధీర్ మ్యాచ్ను ముగించి తన బాధ్యతను నిర్వర్తించాడు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications