ఐపీఎల్ 2026 సీజన్ ట్రెండ్ అనూహ్యంగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్కు ప్రజాదరణ కరువైంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి ఫ్యాన్ బేస్ కలిగిన టీమ్స్ చతికిలపడటం.. మహేంద్ర సింగ్ ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం.. వన్ సైడ్ మ్యాచ్లతో లీగ్ బోరింగ్గా సాగుతుండటంతో జనాలు ఐపీఎల్ను లైట్ తీస్కుంటున్నారు.
ఇప్పటికే ఈ టోర్నీలో ముప్పావు వంతు మ్యాచ్లు పూర్తయ్యాయి. లీగ్ అత్యంత కీలకమైన దశకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ క్రేజ్ అమాంతం పెరగాలి. సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ గురించే చర్చ జరగాలి. కానీ ఐపీఎల్ 2026ను జనాలు పట్టించుకోవడం మానేసారు.

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడం కూడా ఐపీఎల్ క్రేజ్ను తగ్గించింది. సోమవారమే ఫలితాలు వెలవడటంతో దేశం మొత్తం వీటి గురించే చర్చ జరుగుతుంది. ఈ ఎన్నికల నేపథ్యంలోనే గత వారం రోజులుగా ఐపీఎల్ ప్రేక్షకాదరణ పడిపోతు వచ్చింది. టీవీ వ్యూయర్షిప్తో పాటు జియో హాట్స్టార్ వ్యూస్ కూడా దారుణంగా పడిపోయాయి. ఐపీఎల్కు సంబంధించిన వార్తలను కూడా జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఇది బ్రాడ్కాస్టర్స్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఐపీఎల్ 2026 టీవీ రేటింగ్స్ 4.57 నుంచి 3.71కు పడిపోయిందని ఓ నివేదిక పేర్కొంది. సగటు వ్యూయర్షిప్తో పాటు టోటల్ రీచ్ కూడా దారుణంగా పడిపోయిందని వెల్లడించింది. దాంతో అడ్వర్టైజ్మెంట్స్ కూడా 65 నుంచి 45కు తగ్గించారని స్పష్టం చేసింది. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే బ్రాడ్కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్ తీవ్రంగా నష్టపోనున్నాయి. అదే జరిగితే ఐపీఎల్ లీగ్కే తీవ్ర నష్టం జరగనుంది.
ముఖ్యంగా వన్సైడ్ మ్యాచ్లు జనాలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఇప్పటి వరకు 46 మ్యాచ్లు జరగ్గా.. ఇందులో రెండు, మూడు మినహా అన్నీ మ్యాచ్లు ఏకపక్షంగా ముగిసాయి. 264 పరుగుల రికార్డ్ లక్ష్యాన్ని కూడా పంజాబ్ కింగ్స్ ఎలాంటి కష్టం లేకుండా ఛేదించింది. ఈ 46 మ్యాచ్ల్లో ఒకే ఒక్క సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగిందంటే.. లీగ్ ఎంత ఏకపక్షంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్లతో మ్యాచ్లు బోరింగ్గా మారాయి.
