అంపైర్ తప్పిదం.. ధోనీ అసహనం! (వీడియో)

షార్జా: ఐపీఎల్2020 సీజన్లో అంపైరింగ్ తప్పులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ పంజాబ్ మ్యాచ్లో పొరపాటుగా అంపైర్ షార్ట్ రన్గా ప్రకటించడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించింది. దీంతో అంపైర్లపై తీవ్ర దుమారం చెలరేగింది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్లో కూడా ఫీల్డ్ అంపైర్ సి. శంషుద్దీన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం తీవ్ర విమర్శలపాలైంది. అయితే ఈ నిర్ణయంపై కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ ఎలా సమీక్షిస్తారని వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.

ఇంతకేం జరిగిందంటే..?
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ సందర్భంగా దీపక్ చహర్ వేసిన రాయల్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదో బంతికి టామ్ కరన్ను అంపైర్ షంషుద్దీన్ ఔట్ (కీపర్ క్యాచ్)గా ప్రకటించాడు. అప్పటికే రాజస్థాన్ రివ్యూ వాడుకోని విఫలమవడంతో పెవిలియన్ వెళ్లే పరిస్థితి నెలకొంది. కానీ కరన్ మాత్రం కదలకుండా అక్కడే నిలబడిపోయాడు. తన నిర్ణయంపై సందేహం వచ్చిన షంషుద్దీన్ మరో అంపైర్ వినీత్ కులకర్ణితో చర్చించి థర్డ్ అంపైర్కు నివేదించగా అది నాటౌట్గా తేలింది.
ధోనీ వాగ్వాదం..
బంతి కరన్ బ్యాట్కు తగలకపోగా... ధోనీ కూడా బంతి నేలను తాకిన తర్వాతే అందుకున్నాడని టీవీ రిప్లేలో స్పష్టమైంది. అయితే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై మళ్లీ చర్చ ఏమిటంటూ ధోనీ అసహనం వ్యక్తం చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంపైర్ తప్పు చేయడం వాస్తవమే అయినా... తమ నిర్ణయాన్ని పునస్సమీక్షించే అధికారం నిబంధనల ప్రకారం ఫీల్డ్ అంపైర్లకు ఉంది.

విస్మయపరిచిన ధోనీ తీరు
సాధారణంగా ఇలాంటి విషయాల్లో అంచనా తప్పని ధోనీ... క్యాచ్ కాని క్యాచ్ కోసం ఇంతగా వాదించడం అందరిని విస్మయపరిచింది. భారత జట్టును నడిపించేటప్పుడు ‘కెప్టెన్ కూల్'గానే కనిపించిన ధోనీ పసుపు రంగు దుస్తుల్లో ‘హాట్'గా మారిపోతాడేమో? గత ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్తో మ్యాచ్లోనే మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదనకు దిగిన ధోనీ మంగళవారం కూడా అదే తరహాలో ప్రవర్తించాడు.

సంజూ శాంసన్ సూపర్ షో..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' సంజూ శాంసన్ దూకుడుకు తోడు కెప్టెన్ స్టీవ్ స్మిత్, జోఫ్రా ఆర్చర్ చెలరేగడంతో ఈ స్కోరు సాధ్యమైంది. శాంసన్, స్మిత్ రెండో వికెట్కు 57 బంతుల్లోనే 121 పరుగులు జోడించారు. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా.. చహర్, ఎంగిడి, చావ్లా తలో వికెట్ తీశారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసి 16 పరుగులతో ఓడింది. డుప్లెసిస్ అర్ధ సెంచరీ సాధించగా... షేన్ వాట్సన్ ఫర్వాలేదనిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, టామ్ కరణ్ తలో వికెట్ తీయగా.. రాహుల్ తెవాటియా 3 వికెట్లు పడగొట్టాడు. ధాటైన ఇన్నింగ్స్ ఆడిన శాంసన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందింది.
RR vs CSK: ఆ మూడు తప్పిదాలే చెన్నై సూపర్ కింగ్స్ కొంప ముంచాయి!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications