బౌలింగ్ బలహీనం..
బౌండరీలు చిన్నవైన షార్జా గ్రౌండ్లో సంజూశాంసన్, స్టీవ్ స్మిత్ చెలరేగారు. అండర్-19 క్రికెటర్ యశస్వీ జైస్వాల్ విఫలమైనా.. సంజూ శాంసన్ తన రాకతోనే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా స్పిన్నర్లను టార్గెట్ చేస్తూ భారీ సిక్స్లతో విరుచుకుపడటంతో రాజస్థాన్ తొలి 10 ఓవర్లలోనే 119 రన్స్ చేసింది. ఈ మ్యాచ్లో చెన్నై స్పిన్నర్లు జడేజా, పియూష్ చావ్లా పూర్తిగా తేలిపోయారు. అనంతరం ధోనీ తన మార్క్ కెప్టెన్సీతో బౌలర్లను మార్చి రాజస్థాన్ను కట్టడి చేసాడు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఓ దశలో రాజస్థాన్ 200 మార్క్ కూడా అందుకుంటుందో లేదోనని అనిపించింది.
కానీ లుంగిడి ఎంగిడి వేసిన ఆఖరి ఓవర్లో రాజస్థాన్ టేలండర్ జోఫ్రా ఆర్చర్ వరుసగా నాలుగు సిక్స్లు కొట్టడంతో 30 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్తో చెన్నై మూల్యం చెల్లించుకుంది. ఎంగిడినే కట్టడి చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. డెత్ ఓవర్లలో బలాన్ని పెంచుకోవడానికి ఇద్దరు ఓవర్సీస్ పేసర్లు అవసరం లేదనే ఫీలింగ్ కలిగింది.
ధోనీ 7స్థానంలో రావడం..
ఇక 217 పరుగుల భారీ లక్ష్యచేధనలో ఓపెనర్లు షేన్ వాట్సన్, మురళీ విజయ్ శుభారంభాన్ని అందించారు. కానీ వాట్సన్ ఔటైన అనంతరం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మురళీ విజయ్, సామ్ కరన్, రుతురాజ్ గైక్వాడ్ తప్పుడు షాట్లను ఎంచుకొని వికెట్లు పారేసుకున్నారు. ఇక్కడే అనుభవపూర్వకమైన ఆటగాళ్లు అంబటి రాయుడు, సురేశ్ రైనా లేని లోటు కనిపించింది. అయితే ధోనీనే 4 లేదా 5 స్థానంలో వచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అతను క్రీజులోకి వచ్చిన సమయానికే మ్యాచ్ చేదాటిపోయింది. 38 బంతుల్లో 108 పరుగులు చేయడం కష్టం. ఆ సమయంలో అతను హ్యాట్రిక్ సిక్స్లు కొట్టినా లాభం లేకపోయింది. అదే కొంచెం ముందు వచ్చి ఉంటే డూప్లెసిస్తో మిడిల్ ఓవర్లలో మరింత ధాటిగా ఆడి ఉంటే ఫలితం చెన్నై అనుకూలంగా ఉండేది.
వికెట్లు పారేసుకోవడం..
భారీ లక్ష్యం.. బంతి బంతికి చేజింగ్ రన్రేట్ పెరుగుతుండటంతో చెన్నై బ్యాట్స్మెన్ ఒత్తిడికి లోనయ్యారు. భారీ షాట్లు ఆడే క్రమంలో రాంగ్ షాట్ సెలెక్షన్తో వికెట్లు పారేసుకున్నారు. ఇది కూడా చెన్నైని దెబ్బతీసింది. మిడిల్ ఓవర్లలో వెంటవెంటనే వికెట్లు చేజార్చుకోవడంతో.. చివరి 5 ఓవర్లలో ఏం చేయలేని పరస్థితిని తెచ్చి పెట్టింది. మిడిల్ ఓవర్లలోనే కొన్ని భారీ షాట్లు ఆడుంటే.. డెత్ ఓవర్లో విజయ సమీకరణం తగ్గి సులువయ్యేది. ఏదీ ఏమైనా అంబటి రాయుడు జట్టులో లేకపోవడంతో.. బ్యాటింగ్ ఆర్డర్ బ్యాలెన్స్ తప్పిందనే విషయం మాత్రం ఈ మ్యాచ్తో స్పష్టమైంది.
క్రెడిట్ సంజూశాంసన్ దే
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' సంజూ శాంసన్ దూకుడుకు తోడు కెప్టెన్ స్టీవ్ స్మిత్, జోఫ్రా ఆర్చర్ చెలరేగడంతో ఈ స్కోరు సాధ్యమైంది.
శాంసన్, స్మిత్ రెండో వికెట్కు 57 బంతుల్లోనే 121 పరుగులు జోడించారు. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా.. చహర్, ఎంగిడి, చావ్లా తలో వికెట్ తీశారు.
అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసి ఓడింది. డుప్లెసిస్ అర్ధ సెంచరీ సాధించగా... షేన్ వాట్సన్ ఫర్వాలేదనిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, టామ్ కరణ్ తలో వికెట్ తీయగా.. రాహుల్ తెవాటియా 3 వికెట్లు పడగొట్టాడు. ధాటైన ఇన్నింగ్స్ ఆడిన శాంసన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందింది.