సోదరి మరణ వార్త తెలిసినా..
అక్బర్ ఈ మెగా టోర్నీ ఆడుతుండగానే అతడి సోదరి ఖాదిజా ఖాతున్ మృతిచెందారని బంగ్లాదేశ్కు చెందిన ఓ దినపత్రిక పేర్కొంది. జనవరి 22న కవలలకు జన్మనిచ్చిన ఆమె కన్నుమూశారని తెలిపింది. ఆమె మరణానికి కొద్ది రోజుల ముందే.. జనవరి 18న గ్రూప్-సీలో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో అక్బర్ తన జట్టును గెలిపించడం ఆమె చూశారని కూడా పేర్కొంది. ఇక ఆదివారం జరిగిన ఫైనల్లో తన సోదురుడు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించినా ఆమె చూడలేని పరిస్థితి ఏర్పడిందని ఆ పత్రిక రాసింది.
చెప్పని కుటుంబ సభ్యులు..
ఇక తన సోదరి మరణ వార్తను తన కుటుంబ సభ్యులు తెలపలేదని, వేరే వాళ్ల ద్వారా అక్బర్ తెలుసుకున్నాడని అతని తండ్రి చెప్పాడని ఆ పత్రిక పేర్కొంది. ‘అక్బర్ తన సోదరి చాలా క్లోజ్గా ఉండేవాడు. ఆమె కూడా అక్బర్ పట్ల ఎంతో ప్రేమగా ఉండేది. తొలుత అతనికి ఈ విషయం చెప్పొద్దు అనుకున్నాం. కానీ పాకిస్థాన్తో మ్యాచ్ అనంతరం అక్బర్ తన సోదరుడికి ఫోన్ చేసి నిలదీశాడు. ఎందుకు చెప్పలేదని చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో అతనితో మాట్లాడటానికి నాకు ధైర్యం చాలలేదు.'అని అక్బర్ తండ్రి సదరు ప్రతికకు తెలిపాడు.
రోహిత్ బాయ్ కుళ్లుకోకు.. నీ ఫోటో కూడా పెడ్తాలే : చాహల్
ఒక ఫైనల్లోనే..
క్వార్టర్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను, సెమీస్లో న్యూజిలాండ్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. భారత్తో టైటిల్ ఫైట్కు సిద్ధమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అక్బర్ ఈ టోర్నీలో ఏ మ్యాచ్లోనూ 5కు పైగా పరుగులు చేయలేదు. కానీ ఫైనల్లో మాత్రం 43 పరుగులుతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
క్షమాపణలతో పరణితి కనబర్చాడు..
విజయానంతరం మైదానంలో చోటుచేసుకున్న ఘటన పట్ల అక్బర్ అలీ క్షమాపణలు కోరాడు. ‘మా బౌలర్లలో కొంత మంది ఉద్వేగంలో ఉన్నారు. విజయానంతరం మైదానంలో మా ఆటగాళ్ల ప్రవర్తన అలా ఉండాల్సి కాదు. అసలు అక్కడేం జరిగిందో నాకు తెలియదు. దాని గురించి ఎవరిని అడగదలుచుకోలేదు. ఫైనల్ అనగానే భావోద్వేగాలు ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. కొన్నిసార్లు ఆటగాళ్లు వాటిని అదుపు చేసుకోలేరు. కానీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకూడదు. ఏ స్థాయిలోనైనా ప్రత్యర్థి జట్టును గౌరవించాలి. క్రికెట్ జెంటిల్మెన్ గేమ్. కాబట్టి మా జట్టు తరఫున జరిగిన తప్పుకు చింతిస్తూ.. క్షమాపణలు చెబుతున్నా. భారత ఆటగాళ్లను ప్రత్యేకంగా అభినందించాలి. టోర్నీ ఆసాంతం వారు అద్భుతంగా ఆడారు.'అని అక్భర్ తెలిపాడు.