మూడు సీజన్లుగా..
2016 సీజన్లో కోహ్లీ సూపర్ ఫెర్ఫామెన్స్కు తోడుగా డివిలియర్స్, క్రిస్ గేల్ మెరుపులు మెరిపించడంతో ఏకచక్రాధిపత్యంతో ఆ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. టోర్నీ ఆసాంతం ఆసాధారణ ఆటతో ఆకట్టుకున్న కోహ్లీసేన.. ఫైనల్లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. అనంతరం జరిగిన మూడు సీజన్లలో కనీసం లీగ్ స్టేజ్ను కూడా దాటలేక ఘోరంగా వైఫల్యాలను చవిచూసింది.
టీమ్ మేనేజ్మెంటే కారణం..
ఇక భారత్ తరపున దేశానికి తిరుగులేని కెప్టెన్గా నిలిచిన కోహ్లీ ఐపీఎల్లో మాత్రం సత్తా చాటలేకపోతున్నాడు. ఇది ఆర్సీబీ అభిమానులకే కాకుండా భారత క్రికెట్ అభిమానులందరికీ మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ వైఫల్యానికి గల కారణాన్ని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వివరించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆర్సీబీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడానికి జట్టు మేనేజ్మెంటే కారణమని తెలిపాడు.
కోహ్లీని లెక్క చేయరు..
కెప్టెన్ కోహ్లీ సలహాలను, సూచనలను జట్టు యాజమాన్యం పట్టించుకోదని, కనీసం ఆటగాళ్ల ఎంపికలో కూడా విరాట్ నిర్ణయాలకు విలువ ఉండదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ‘ఐపీఎల్లో కోహ్లీ కచ్చితంగా మంచి కెప్టెన్ కాదు. జట్టు కూడా గొప్ప ప్రదర్శనలు చేయలేదు. ఒకటి, రెండేళ్లు కాదు.. ఎన్నో సీజన్లుగా ఇదే తీరు కొనసాగుతోంది. ఇది ఓ చేదు నిజం. దీనికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా జట్టు ఎంపికలో సరైన ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం. ప్రతీ సీజన్లో ఆర్సీబీ జట్టులో ఏదో లోటు కనపడుతూనే ఉంటుంది. సరైన ఫాస్ట్ బౌలర్లు ఉండరు. 5, 6 స్థానాల్లో పటిష్ఠమైన బ్యాటింగ్ లైనప్ లేకపోవడం.. ఇలా అనేక సమస్యలు ఆర్సీబీలో కనపడతాయి.
ఫెయిల్యూర్ కెప్టెన్గా..
ఈ సమస్యలపై ఆ జట్టు యాజమాన్యం ఎప్పుడూ దృష్టి సారించదు. దీనిపై కోహ్లీ నిర్ణయాలను కూడా యాజమాన్యం పరిగణలోకి తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు'అని ఆకాశ్ చోప్రా తెలిపాడు. అంతేకాకుండా ఓ పేలవమైన జట్టుతో బరిలోకి దిగి అద్భుతాలు సాధించాలంటే ఎవరి వల్ల కాదని, కోహ్లీ కూడా అందుకే ఐపీఎల్లో ఓ ఫెయిల్యూర్ కెప్టెన్గా మిగిలిపోయాడని చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇక టీమ్ సహాయక సిబ్బందిని ఎంచుకునే విషయంలో కూడా కోహ్లీ ఏం చేయలేకపోతున్నాడన్నాడు. ఇతర కెప్టెన్లు మాత్రం తమకు నచ్చిన వారిని తీసుకుంటున్నారని తెలిపాడు.
నాన్న నల్లగా ఉన్నాడని అమ్మ వాళ్లు మాట్లాడలేదు.. లైవ్లో కంటతడి పెట్టుకున్న విండీస్ దిగ్గజం