నాన్న నల్లగా ఉన్నాడని అమ్మ వాళ్లు మాట్లాడలేదు.. లైవ్లో కంటతడి పెట్టుకున్న విండీస్ దిగ్గజం

న్యూఢిల్లీ: జాతి వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ తమ గళాన్ని వినిపించారు. తాజాగా వెస్టిండీస్ దిగ్గజ పేసర్ మైఖేల్ హోల్డింగ్ తన జీవితంలో ఎదుర్కొన్న జాతి వివక్ష గురించి మాట్లాడుతూ లైవ్లోనే కంటతడి పెట్టుకున్నాడు. తన జీవితంలో అవమానాలను గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యాడు.
సౌతాంప్టన్ వేదికగా బయోసెక్యూర్ విధానంలో ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా మైఖేల్ బుధవారం స్కై స్పోర్ట్స్తో మాట్లాడాడు. జాతి వివక్ష కారణంగా తాను పడ్డ క్షోభను వివరిస్తూ బోరున విలపించాడు. జాతి వివక్షపై ప్రజలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

నా తల్లిదండ్రులు గుర్తొచ్చి..
‘నిజం చెప్పాలంటే ఇలా భావోద్వేగం చెందడానికి కారణం నా తల్లిదండ్రులను తలుచుకోవడమే. ఇప్పుడు కూడా ఏడుపొస్తుంది. నా జీవితంలో మా తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో నాకు తెలుసు. మా నాన్న నల్లగా ఉన్నాడని మా అమ్మవాళ్ల కుటుంబం ఆమెతో మాట్లాడలేదు. వాళ్లు ఎలాంటి మానసిక క్షోభను అనుభవించారో నాకు తెలుసు. అదే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది' అని మైఖేల్ హోల్డింగ్ కన్నీటి పర్యంతమయ్యాడు.

అందరూ ఒక్కటే..
తానేం చెప్పదల్చుకున్నానో ప్రజలు అర్థం చేసుకుంటారని, అలాగే తాను ఎక్కడి నుంచి వచ్చానో కూడా తెలుసుకుంటారని మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం తనకు 66 ఏళ్లు ఉన్నాయని, తన జీవితంలోనూ అలాంటి వివక్షకు గురయ్యానని చెప్పాడు. ఇతరుల నుంచి చాలా సార్లు అవమానాలు ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకున్నాడు. ఇలాంటివి జరగకూడదని, ప్రజలంతా ఒక్కటేననే విషయం అందరూ అర్థం చేసుకోవాలని ఈ విండీస్ మాజీ పేసర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

బ్లాక్ లైవ్స్ మ్యాటర్..
ఇక కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఓ పోలీస్ అధికారి కర్కశత్వానికి జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్షపై ఆందోళనలు చెలరేగాయి. ఈ హత్యతో ప్రపంచవ్యాప్తంగా వర్ణవివక్షపై ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలో క్రికెట్లోనూ జాతి వివక్ష ఉందని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సమీ పేర్కొన్నాడు. ఆపై చాలా మంది తమ గళం వినిపించారు. ఈ నేపథ్యంలో 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది.

జాతి వివక్షకు సంఘీభావం..
అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాపసూచకంగా మ్యాచ్లో తొలి బంతిని వేయడానికి ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని నిరసనను ప్రదర్శించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా వీరందరూ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్' లోగో ముద్రించి ఉన్న జెర్సీలతో బరిలోకి దిగారు. ఇక మ్యాచ్కు ముందు క్రీడల్లోనూ జాతివివక్షను నిర్మూలించాల్సిన అవసరం ఉందని, దానిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ తెలిపాడు. ఈ ఉద్యమంలో తాము భాగస్వాములమువతామని ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా ముందుకు వచ్చారు.
టామ్ మూడీ వరల్డ్ టీ20 ఎలెవన్.. ధోనీకి నో చాన్స్.. కెప్టెన్గా రోహిత్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications