బెల్గ్రేడ్ (సెర్బియా): కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న వేళ బాధ్యతారాహిత్యంగా టోర్నీ నిర్వహించిన ప్రపంచ నంబర్వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్పై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. జొకో చావాల్సిందేనంటూ పలువురు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కరోనా బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు జొకోవిచ్, అతడి సోదరుడు కలసి ఆడ్రియా టూర్ ఎగ్జిబిషన్ ఈవెంట్ నిర్వహించారు. అయితే, ఇందులో పాల్గొన్న జొకోతో సహా నలుగురు టాప్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో నొవాక్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఆటగాళ్లు భౌతిక దూరం పాటించకుండా డ్యాన్స్లు వేయడం, పార్టీలు చేసుకొనే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎక్కువ మంది కొవిడ్ బారినపడ్డారు. దీనిపై జొకో క్షమాపణలు కూడా కోరాడు. అయితే క్రొయేషియాలోని స్లిపట్ నగరంలో కరోనా అంటించిన జొకోవిచ్ చావాలని కోరుకుంటున్నట్లు కొందరు నిరసనకారులు గోడలపై రాతలు రాశారు.'జొకో నువ్వు చావాలని స్లిపట్ నగరం మనస్ఫూర్తిగా కోరుకుంటోంది'అనే రాతలు కనిపించాయి.
ఇక జొకోవిచ్కు సెర్బియా ప్రధాని అనా బోర్నబిచ్ మద్దతుగా నిలిచారు. ఈ పరిస్థితుల్లో దేశంలో టోర్నీల నిర్వహణకు అనుమతించిన తనది తప్పని.. జొకోది కాదన్నారు. ఈ నేపథ్యంలో నొవాక్ను ఒంటరిగా వదిలేయమని అనా అన్నారు. 'అతడు మంచి చేయాలని చూశాడు. మానవతా దృక్పథంతో కొవిడ్ బాధితుల కోసం విరాళాలు సేకరించాలనుకున్నాడు. ఎదైనా తప్పు జరిగితే అది నావల్లే. జొకోను వదిలేయండి' అని అనా బోర్నబిచ్ విజ్ఞప్తి చేశారు.